Shirish: 2025 సంక్రాంతికి విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. అయితే, భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా ఆశాభంగం కలిగించింది.
ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ శిరీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ గురించి స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. “గేమ్ ఛేంజర్ విడుదలైనప్పుడు మా పరిస్థితి అంతే! జీవితం అయిపోయినట్లే అనిపించింది. ఏదైనా సహాయం చేస్తారా అని ఎవరినీ అడగలేము. హీరో అయినా, డైరెక్టర్ అయినా ఒక్కసారి ‘ఏమైంది?’ అని కూడా ప్రశ్నించలేదు” అంటూ శిరీష్ చేసిన కామెంట్స్కి పెద్ద స్పందన వస్తోంది.
అయితే, వారు ఎవరినీ నిందించడం లేదని శిరీష్ స్పష్టం చేశారు. “మేమే ఇష్టపడి సినిమా చేశాం. నష్టాలను మేమే భరించాం. గేమ్ ఛేంజర్ వల్ల చాలా పోయింది. కానీ అదే టైంలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా కొంత ఊరటనిచ్చింది. నాలుగు రోజుల వ్యవధిలో మా పరిస్థితి తిరిగి మారింది. ఆ సినిమా లేకపోతే ఏం అయేదో ఊహించలేం” అని చెప్పారు.

Shirish: చరణ్ తో మనకు మంచి రిలేషన్ ఉంది.
ఇక రామ్ చరణ్తో రిలేషన్ పై మాట్లాడుతూ, “ఆయనతో మనకు మంచి రిలేషన్ ఉంది. మళ్లీ సినిమా చేయాలంటే చేయొచ్చు, చేయకపోయినా పరవాలేదు. అది పూర్తిగా ఆయన ఇష్టం” అని పేర్కొన్నారు. తమ బ్యానర్ (SVC) పారితోషికాల్ని వెనక్కి అడిగే స్థాయికి చేరలేదని, వచ్చిన లాభం తమదే, వచ్చిన నష్టం కూడా తమదే అనే ధోరణితో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఈ కామెంట్స్ చూసిన ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు శిరీష్ ఓపెనెస్కి మంచి స్పందన ఇస్తున్నారు. ఒక సినిమాతో పోయిన నష్టం నుంచి వెంటనే కోలుకోవడం, మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ కావడం మూవీ బిజినెస్ లో సాధారణమే అయినా, ఈ స్థాయిలో ఓ ప్రొడ్యూసర్ అంత లోతుగా మాట్లాడటం అరుదైన విషయం.
మొత్తానికి, ‘గేమ్ ఛేంజర్’ అట్టర్ ఫ్లాప్ అయినా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తిరిగి నిలబడిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రస్తుతం ఇంకొన్ని ప్రాజెక్టులపై దృష్టిసారించింది.