Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొండపై భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఎప్పటికప్పుడు వినూత్న నిర్ణయాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇకపోతే స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురుచూడాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. తాజాగా టీటీడీ అధికారులు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని తెలియజేశారు.
ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడాల్సిన పనిలేదు క్షణాలలోనే భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి, భక్తులకు శీఘ్రంగా ప్రసాదాన్ని అందజేసేందుకు ‘మూవింగ్-టేబుల్’ (కన్వేయర్ బెల్ట్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వెసులుబాటు కలిగింది.

Tirumala: ప్రసాదం పంపిణీ కోసం మూవింగ్ టేబుల్..
ఏడు మీటర్ల పొడవున్న టేబుల్ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా నిరంతరం కదులుతుంటుంది. సిబ్బంది ప్రసాదం ప్లేట్లను దీనిపై ఉంచగానే, క్యూలైన్లో వెళ్లే భక్తులు ఏమాత్రం ఆగాల్సిన పనిలేకుండా నడుస్తూనే సులభంగా ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. గత నెలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం అద్భుతమైన ఆదరణను పొందడంతో ప్రస్తుతం ప్రసాదం కౌంటర్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, నారాయణగిరి షెడ్లతో పాటు ప్రధాన క్యూలైన్లలోకి కూడా ఈ మూవింగ్-టేబుల్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు టీటీడీ వినూత్న చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తిరుమల వెళుతున్న భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోందని చెప్పాలి.

