Vishwambhara: చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం “విశ్వంభర” గురించి తాజా అప్డేట్ చిత్ర దర్శకుడు మల్లిడి వశిష్ఠ అందించారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, వాయిదా పడటం, మధ్యలో చిరంజీవి కొత్త సినిమా (అనిల్ రావిపూడి దర్శకత్వం) సెట్స్కి వెళ్లడంతో “విశ్వంభర” ప్రాజెక్ట్ ఏ స్థితిలో ఉందనే అనుమానాలు అభిమానుల్లో పెరిగాయి. తాజాగా వశిష్ఠ తన స్టేట్మెంట్లో ఈ విషయాలన్నిటికీ స్పష్టత ఇచ్చారు.
వశిష్ఠ తెలిపిన వివరాల ప్రకారం, ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు అత్యంత కీలకంగా మారాయి.
ఈ చిత్రంలో 4,676 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని వశిష్ఠ వెల్లడించారు. ఇది తక్కువ సంఖ్యేం కాదు.. ఇది అత్యంత భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండే ఇండియన్ సినిమాలలో ఒకటిగా నిలవనుంది. ప్రపంచంలోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్ర పనుల్లో భాగం కావడమూ గమనించదగిన విషయం. ప్రేక్షకులకు ఒక కొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ విజువల్ ఎఫెక్ట్స్ నిర్మితమవుతున్నాయి.

Vishwambhara: హీరో పంచభూతాలతో తన ప్రయాణం చేస్తాడు.
16 ప్రత్యేక సెట్స్ ఈ సినిమా కోసం వేసినట్టు దర్శకుడు తెలిపారు. ఈ సెట్స్ కేవలం బ్యాక్డ్రాప్ మాత్రమే కాకుండా కథలో కీలకమైన పాత్రగా ఉంటాయని తెలిపారు. ప్రకృతి యొక్క పంచభూతాలతో కథ ముడిపడి ఉంటుంది. హీరో ఈ పంచభూతాలతో తన ప్రయాణం చేస్తాడు. ఇందులో మైథాలజీ, ఫాంటసీ, యాక్షన్ వంటి అనేక అంశాల మేళవింపు ఉంటుంది.
ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశ పూర్తయ్యాక, విశ్వంభర విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని వశిష్ఠ స్పష్టం చేశారు. ఒకవేళ వీఎఫ్ఎక్స్ పనులు ఆశించిన వేగంగా పూర్తైతే, ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. విశ్వంభర ఒక విజువల్ ఎక్స్పీరియన్స్గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. చిరంజీవి అభిమానులకు ఇది నిజమైన ట్రీట్గా మారే అవకాశం కనిపిస్తోంది.