Politics: ఏపీలో రాజకీయాలు రోజురోజుకి హాట్ గా మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీని గద్దె దించాలనే యోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా తన వ్యూహాలని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజమైన నాయకుడు అని తన సినిమాలోని డైలాగ్ ని తన రాజకీయ జీవితంలో కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడు. అసలు రాజకీయ విశ్లేషకులకి సైతం అందని ఆలోచనతో ఎప్పటికప్పుడు తన నిర్ణయాలతో ఏపీ రాజకీయాలలో ప్రతి ఒక్కరు తన గురించి చర్చించుకునేలా చేస్తున్నారు.
గతంలో మీడియా, రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గురించి కాని, జనసేన గురించి కాని ఎక్కువగా పట్టించుకునే వారు కాదు. అయితే రాజకీయాలలో ప్రజలకి చేరువ కావాలంటే మనం లేకపోయిన మన పేరు మాత్రం ప్రజలకి నిత్యం ఏదో ఒక రూపంలో వినిపిస్తూ ఉండాలనే విధంగా జనసేనాని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే స్టేట్ మెంట్ ఇవ్వడం ద్వారా టీడీపీతో పొత్తుకి సంకేతాలు ఇచ్చినట్లు సందేశం పంపించారు. అదే సమయంలో తాను బీజేపీతోనే ఉన్నానని, అలాగే రాబోయే ఎన్నికలలో జనసేన అధికారంలోకి వస్తుందని తన ప్రతి మీటింగ్ లో కూడా బలంగా స్వరాన్ని వినిపిస్తున్నారు.
అలాగే వ్యూహాలు తనకి వదిలేయాలని, తనపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు తనని నమ్మాలని పిలుపునిచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ కచ్చితంగా జనసేన పార్టీకి మేలు చేసే నిర్ణయమే తీసుకుంటారని జనసైనికులు భావిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర అవుతాడో అనే భయంతో అదే పనిగా అతని మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. అస్సలు వారికి మానసిక ప్రశాంతత లేకుండా పవన్ కళ్యాణ్ చేసాడనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. అక్కడ చంద్రబాబుతో రెండు గంటలకి పైగా ఇద్దరూ చర్చించారు. ఇక వీరి భేటీ మరోసారి ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారడంతో పాటు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గురించి చర్చించుకునే విధంగా జనసేనాని చేయగలిగారు.
వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూ, టీడీపీ వాళ్ళు పవన్ కి మద్దతుగా మాట్లాడుతూ జనసేనాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే టీడీపీతో జనసేన పొత్తు ఖరారు అయిపోయిందని, 30 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు ఓకే చెప్పారని కూడా ప్రకటించేశారు. అయితే ఇదంతా జనసేనాని బలహీనం చేయడానికి వైసీపీ చేస్తున్న వ్యూహాత్మక ప్రచారం అనే విషయం అందరికి తెలుసు. ఇక వైసీపీ సపోర్ట్ గా ఉండే రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ లు కూడా ఇదే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఈ ప్రచారాన్ని చూస్తూనే ఉన్న జనసేనాని మాత్రం సైలెంట్ గా ఉండటంతో పాటు పార్టీ నాయకులకి కూడా సైలెంట్ గా ఉండమని సూచించారు. దీంతో వారు ఆ ప్రచారంపై పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఇక జనవరి 12న రణస్థలం వేదికగా జరిగే యువశక్తి సభలో రాజకీయ వర్గాలలో జరిగే అన్ని ప్రచారాలకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడంతో పాటు, మరింతగా వైసీపీకి టెన్షన్ పెంచే విధంగా భవిష్యత్ కార్యాచరణని ప్రకటించే అవకాశం ఉందనే మాట జనసేన వర్గాలలో వినిపిస్తుంది.