Political: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో ఎలా అయినా అసెంబ్లీలో అడుగుపెట్టాలని గట్టిగా కోరుకుంటున్నారు. అలాగే వైసీపీని గద్దె దించాలని భావిస్తున్నారు. కచ్చితంగా జగన్ రెడ్డి ని అధికారానికి దూరం చేస్తానని పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి తమతో ఫైట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాని పవన్ కళ్యాణ్ మాత్రం వ్యూహాత్మకంగా వైసీపీ చాలెంజ్ కి రెస్పాండ్ కాకుండా ఏం చేస్తే వైసీపీని అధికారానికి దూరం చేయవచ్చు అనేది ఆలోచిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే అది ప్రస్తుతం తమతో కలిసి ఉన్న బీజేపీ పార్టీతో కలిసి ఉంటుందా లేదా జనసేన మాత్రమే టీడీపీతో కలిసి వెళ్తుందా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాకుళంలో రణస్థలం వేదికగా నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఒక దుర్మార్గమైన వ్యక్తిని అధికారంలో నుంచి దించడానికి అవసరానికి తగ్గట్లు విభేదించే వారితో కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. అలాగే టీడీపీతో పొత్తుతో వెళ్ళాలా లేదా ఒంటరిగా పోటీ చేయాలా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు.
మన గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగించకుండా సీట్లు ఇస్తే పొత్తుతో వెళ్తానని తేల్చి చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి ఇప్పటికే ఒకసారి వీరమరణం పొందానని, అయితే ఈ సారి ప్రజలని మంచి పాలనని అందించడానికి తాను పొత్తులతో వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పారు. అదే సమయంలో ప్రజలు అండగా నిలబడి కచ్చితంగా తనకి అధికారం అప్పగిస్తారు అనే నమ్మకాన్ని ఇస్తే కచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
అలాగే పొత్తు విషయంలో కూడా టీడీపీ పార్టీకి తన బలం 50 నుంచి 55 స్థానాలు అని చెప్పకనే చెప్పారు. ఆ రేంజ్ లో సీట్లు ఇచ్చి, అధికార భాగస్వామ్యం ఇచ్చి గౌరవాన్ని ఇస్తే పొత్తు పెట్టుకుంటా అని ఈ యువశక్తి సభ ద్వారా చెప్పారు. అలాగే అభిమానులని తగ్గించే పనులు తాను ఎప్పటికి చేయనని, కచ్చితంగా మీరు కోరుకుంటే తాను ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంట్ సీట్ల విషయంలో టీడీపీ ముందుకొచ్చి అలాగే తాను కోరుకున్న గౌరవప్రదమైన స్థానం ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.