Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన తర్వాత ఆయన మొదటిసారిగా గత ప్రభుత్వ వైఫల్యాలపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై అత్యంత ఘాటుగా స్పందించారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ ఉన్న భజన బృందం వల్లే పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని ఆయన సంచలన నిజాలను బయటపెట్టారు.
గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల ప్రతిపాదనపై బాలినేని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను విశాఖపట్నం సహా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని ఆయన చెప్పారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే అటు కృష్ణా, ఇటు గుంటూరు జిల్లాల ప్రజలు సంపూర్ణంగా ఆమోదిస్తారని నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా జగన్కు రాయబారం పంపినట్లు గుర్తుచేశారు. కానీ, ఆ మంచి మాటను పెడచెవిన పెట్టడం వల్లే ఎన్నికల్లో తాము ఓడిపోవడమే కాకుండా, పార్టీ కూడా ఘోరంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh: నిజాయితీని నిరూపించుకోవడానికే
రాజకీయాల్లో అధినేత బాగుంటేనే తామంతా బాగుంటామనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, వైసిపిలో ఉన్నప్పుడు కూడా అదే నిజాయితీతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడానని బాలినేని స్పష్టం చేశారు. కేవలం జగన్ మెప్పు కోసమో, భజన చేయడానికో తాను ఎప్పుడూ తాపత్రయపడలేదని.. అందుకే నాడు తన మాటలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రస్తుతం జనసేనలో కూడా తాను అదే ఫార్ములాను పాటిస్తున్నానని, కేవలం పార్టీ సభ్యత్వంతోనే తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని, స్వల్ప వ్యవధిలోనే ఎలాంటి పదవులనూ ఆశించడం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఇక రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే తన కుమారుడిని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని బాలినేని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలపై ఎలాంటి నిజం లేదని తేల్చడానికే.. తాను స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్లు సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలన్నింటిపై తక్షణమే విచారణ జరిపించాలని, తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబును కోరినట్లు బాలినేని స్పష్టం చేశారు. లోపాయకారీ ఒప్పందాలు, మొహమాటాలు తనకు లేవని, నిజాయితీని నిరూపించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

