AP POLITICS: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎన్నో మీమ్స్, ట్రెండ్స్ చూసుంటాం. కానీ, ఏకంగా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకే ముచ్చెమటలు పట్టిస్తూ, ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్లతో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, యువత ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పుట్టుకొచ్చిన ఈ బొద్దింకల పార్టీపై తాజాగా రాజకీయ వర్గాల నుంచి తొలి అధికారిక స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ డిజిటల్ విప్లవంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆన్లైన్ ఉద్యమాన్ని కేవలం ఒక జోక్గానో, టైమ్పాస్ వ్యవహారంగానో కొట్టిపారేయలేమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్పై యువత ఇంతలా స్పందిస్తోందంటే.. దాని వెనుక ఉద్యోగాల విషయంలో వారిలో పేరుకుపోయిన అసంతృప్తి, నిజమైన ఆకాంక్షలు దాగున్నాయని ఆయన విశ్లేషించారు. పాలకులు, విధాన రూపకర్తలు ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా భావించి, యువత అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలను ఎప్పటికప్పుడు రీ-చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

AP POLITICS: సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్
యువతరం ఎదుర్కొంటున్న సమస్యలపై సానుభూతి ప్రకటిస్తూనే, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని డిజిటల్ ఇండియా, సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్ యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని పల్లా పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి భాగస్వామిగా తాము యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.
అదే సమయంలో ఆన్లైన్ వేదికలపై జరిగే ఇలాంటి చర్చల్లో యువత కాస్త అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరుద్యోగుల ఆవేదనను ఆసరాగా చేసుకుని, కొన్ని బాహ్య శక్తులు లేదా స్వార్థ ప్రయోజనాలు ఆశించే శక్తులు ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని పల్లా అభిప్రాయపడ్డారు.

