Fri. Jun 12th, 2026

    AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం, కేటాయింపుల చుట్టూ తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు ఒక్కసారిగా ‘కాక్రోచ్’ అనే వింత పదం చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. అసలు ఈ ‘కాక్రోచ్’ పాలిటిక్స్ ఏంటి? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

    నిజానికి ఈ కాక్రోచ్ అనే పదం వెనుక దేశవ్యాప్తంగా యువత చేస్తున్న ఒక పెద్ద పోరాటం దాగి ఉంది. ` కాక్రోచ్ జనతా పార్టీ` (CJP) ఆధ్వర్యంలో అభిజిత్ దీప్కే అనే యువకుడు దేశంలోని మెట్రో నగరాలను వేదికగా చేసుకుని ఒక నిరసన ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇందులో భాగంగానే జూన్ 14న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. దేశంలో వ్యవస్థాగత లోపాల వల్ల నష్టపోతున్న అట్టడుగు, మధ్యతరగతి వర్గాలను, ముఖ్యంగా యువతను కాక్రోచులుగా అభివర్ణిస్తూ.. వారు తిరగబడితే వ్యవస్థలు తలవంచక తప్పదనే అజెండాతో ఈ ఉద్యమం సాగుతోంది.

    ap-politics-jagans-warning-cockroach-politics-in-ap
    ap-politics-jagans-warning-cockroach-politics-in-ap

    AP POLITICS: ఇదే అస్త్రాన్ని జగన్ ఏపీ రాజకీయాల్లోకి లాగారు. 

    ఇప్పుడు ఇదే అస్త్రాన్ని జగన్ ఏపీ రాజకీయాల్లోకి లాగారు. ఇటీవల దేశాన్ని కుదిపేసిన ‘నీట్’ ప్రశ్నపత్రాల లీకేజీ, సీబీఎస్ఈ మూల్యాంకన లోపాల వల్ల దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో విద్యార్థులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరిలో ఏపీకి చెందిన యువత కూడా భారీగా ఉన్నారు. అయితే, జగన్ ఇక్కడితో ఆగకుండా దీనికి ఏపీలోని మెగా డీఎస్సీ వివాదాన్ని కూడా ముడిపెట్టారు. నీట్ లీకేజీ కంటే ఏపీలో మెగా డీఎస్సీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద లీకేజీ లాంటివని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

    ఇదంతా కూటమి ప్రభుత్వంపై యువతలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే వ్యూహాత్మక చర్యగానే కనిపిస్తోంది. సాధారణంగా నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో లోపాలు అనేవి యువతలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ అసహనం సరిగ్గా ఛానలైజ్ అయితే అది ఒక సునామీలా మారుతుంది. ఏపీలో కూడా నిరుద్యోగ యువతలో అలాంటి లావా ఉడుకుతోందని, దానికి నాయకత్వం వహించడానికి వైసీపీ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని జగన్ పంపారు. యువత అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకుని, మైలేజ్ సాధించాలనేది ప్రతిపక్ష వ్యూహం.

    అయితే, రాజకీయాల్లో ఆరితేరిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ కాక్రోచ్ హెచ్చ‌రిక‌ను అంత తేలిగ్గా తీసుకునేలా లేరు. యువత ఆగ్రహిస్తే వచ్చే నష్టం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి ఈ కాక్రోచ్ పాలిటిక్స్ ఏపీలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి? యువతను ఆకట్టుకోవడంలో వైసీపీ సఫలమవుతుందా? లేక కూటమి ప్రభుత్వం ముందస్తు వ్యూహాలతో దీనికి చెక్ పెడుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.