TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్లోబల్ విజన్ తో అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగానే ఇటీవల సింగపూర్లో పర్యటించి వచ్చిన మంత్రుల బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పవర్ఫుల్ హోమ్ వర్క్ ఇచ్చారు. విదేశాల్లో నేర్చుకున్న పాఠాలను ఏపీ మట్టిలో పండించాలని, ప్రజలకు ఆ మార్పు స్పష్టంగా కనిపించాలని ఆయన గట్టిగా ఆదేశించారు.
శిక్షణ ముగించుకున్న మంత్రులకు చంద్రబాబు కేవలం 100 రోజుల సమయాన్ని డెడ్లైన్గా నిర్ణయించారు. ఈ తక్కువ కాలంలోనే ప్రతి శాఖలో కనీసం మూడు వినూత్న ప్రయోగాలు అమలులోకి రావాలని లక్ష్యంగా పెట్టారు. “చూసింది చాలు.. ఇప్పుడు చేసి చూపండి” అన్నదే ముఖ్యమంత్రి సందేశం. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఎర్ర తివాచీ పరిచే విధానం నుంచి, సామాన్యుడి ఫైల్ త్వరగా కదిలే పారదర్శకత వరకు ప్రతి అంశంలోనూ సింగపూర్ స్పీడ్ ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

TDP PARTY: 100 రోజుల డెడ్ లైన్ మంత్రుల సమర్థతకు ఒక అగ్నిపరీక్ష
మంత్రులు అక్కడ అధ్యయనం చేసిన స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు కేవలం రాజధాని అమరావతికే పరిమితం కాకూడదని సీఎం స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడం, నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, మరియు డిజిటల్ సేవలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. ఏపీలోని ప్రతి నగరంలోనూ సింగపూర్ తరహా మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించారు.
ప్రభుత్వ పనితీరుపై వస్తున్న విమర్శలకు మంత్రుల పనితీరుతోనే సమాధానం చెప్పాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం దస్త్రాలకే పరిమితం కాకుండా, అవి క్షేత్రస్థాయిలో ఉపాధిని, ఆదాయాన్ని సృష్టించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ 100 రోజుల డెడ్ లైన్ మంత్రుల సమర్థతకు ఒక అగ్నిపరీక్ష వంటిదే. చంద్రబాబు నిర్దేశించిన ఈ సింగపూర్ టాస్క్ ఏపీ తలరాతను ఏ మేరకు మారుస్తుందో వేచి చూడాలి.

