వివరాల్లోకి వెళ్తే.. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం తన నియోజకవర్గ పరిధిలోని కంకిపాడు మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో కంకిపాడు సినిమా హాల్ సెంటర్ వద్ద చాలా మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు ఎండలో బస్సు కోసం నిలబడి ఉన్నారు. ప్రయాణికులు చెయ్యి చూపించినా, బస్టాప్లో జనం ఉన్నా సరే.. ఒక ఆర్టీసీ బస్సు ఆపకుండా వేగంగా దూసుకెళ్లిపోయింది. సరిగ్గా అదే సమయంలో బస్సు వెనుకే తన కారులో వస్తున్న ఎమ్మెల్యే ఈ దృశ్యాన్ని గమనించారు.

ప్రజల అవస్థలు చూసిన ఎమ్మెల్యే, వెంటనే తన డ్రైవర్ను ఆదేశించి ఆ బస్సును వెంబడించారు. కారును వేగంగా పోనిచ్చి, పెనమలూరు-కంకిపాడు మధ్యలో బస్సును ఓవర్టేక్ చేసి దానికి అడ్డంగా తన కారును ఆపారు. ఎమ్మెల్యే కారు అడ్డుగా రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసి బస్సును నిలిపివేశాడు. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే నేరుగా బస్సులోకి ఎక్కి డ్రైవర్, కండక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“బస్టాప్లో జనం కనిపిస్తున్నా బస్సు ఎందుకు ఆపలేదు? మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంటే, మీరు బస్సులు ఆపకుండా వెళ్తే ఆ పథకానికి అర్థం ఏముంటుంది?” అంటూ ఎమ్మెల్యే వారిని నిలదీశారు. డ్రైవర్ సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా.. “నేను స్వయంగా చూశాను, బస్సు ఖాళీగా ఉన్నా ఆపకుండా వచ్చారు. మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది” అని గట్టిగా హెచ్చరించారు.
అక్కడితో ఆగకుండా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అదే బస్సులో ప్రయాణికులతో కలిసి కొంత దూరం ప్రయాణించారు. బస్సులో ఉన్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సులు ఆపకపోయినా, సిబ్బంది సరిగ్గా స్పందించకపోయినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజాప్రతినిధి అంటే ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ఇలా ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించాలని ఆయన నిరూపించారంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

