Wed. May 13th, 2026

    TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘పర్ఫార్మెన్స్’ మంత్రం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. తాజాగా పార్టీ అంతర్గతంగా నిర్వహించిన ఒక సర్వే నివేదిక ఇప్పుడు పసుపు దళంలో పెను సంచలనం రేపుతోంది. మొత్తం 135 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల మెప్పు పొందుతున్నది మాత్రం కేవలం 72 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంటే దాదాపు సగం మంది నేతల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

    ఈ సర్వేలో ‘పాస్ మార్కులు’ సాధించిన 72 మంది ఎమ్మెల్యేలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురుచూడకుండా, తెలివిగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ గుర్తించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ నియోజకవర్గాలకు మళ్లించుకోవడంలోనూ, ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ నిధులు రాబట్టడంలోనూ వీరు సక్సెస్ అయ్యారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు వంటి జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలు కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తూ ప్రజల్లో మార్కులు కొట్టేస్తున్నారు. వీరికి అటు ఢిల్లీ నుంచి, ఇటు పార్టీ నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది.

    chandrababu-naidu-has-the-report-card-of-the-mlas-in-his-hands-those-72-people-are-safe
    chandrababu-naidu-has-the-report-card-of-the-mlas-in-his-hands-those-72-people-are-safe

    TDP PARTY: చంద్రబాబు కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 

    అయితే, మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటం అభివృద్ధికి శాపంగా మారింది. సొంత పార్టీ నేతల మధ్యే సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పార్టీ భావిస్తోంది. పనితీరు సరిగా లేని నేతలు తమ వైఫల్యాలను అధికారులపైకో, ప్రభుత్వంపైకో నెట్టేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోని కొందరు నేతల తీరుపై అధిష్టానం కన్నెర్ర చేసినట్లు సమాచారం.

    ఇదే క్ర‌మంలో వెనుకబడిన ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు-ఎంపీల మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రత్యేకంగా పార్టీ కమిటీలను రంగంలోకి దించుతున్నారు. అయినా తీరు మారని నేతల విషయంలో కఠినంగా ఉండాలని, అవసరమైతే రాజకీయంగా పక్కన పెట్టాలని కూడా పార్టీ యోచిస్తోంది. పని చేసేవారికే పట్టం కట్టే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు మిగిలిన ఆ 63 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికైనా వారు రూటు మార్చుకుంటారో లేక రూటు నుంచి త‌ప్పుకుంటారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.