Wed. Jun 24th, 2026

    AP POLITICS: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒకరినొకరు నామరూపాలు లేకుండా చేయాలనే రేంజ్‌లో నడిచింది వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య యుద్ధం. 2019 నుంచి 2024 వరకు పవన్‌ను వ్యక్తిగతంగా, రాజకీయంగా వైసీపీ టార్గెట్ చేసిన విధానం అంతా చూశారు. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ పూర్తిగా రూట్ మార్చింది. నిన్నటి వరకు ‘ప్యాకేజీ స్టార్’ అంటూ విమర్శించిన నోళ్లే, ఇప్పుడు ఆయన జోలికి వెళ్లొద్దంటూ సైలెంట్ అవుతున్నాయి. వైసీపీ తీసుకున్న ఈ సడన్ యూ-టర్న్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?

    2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌ను లైట్‌గా తీసుకుంది. “రెండు సీట్లు లేని ఆయన మనల్ని ఏం చేస్తాడు?” అనే అతివిశ్వాసంతో పవన్‌పై విమర్శల దాడి పెంచింది. అయితే, పవన్ వెనుక ఉన్న ఒక బలమైన సామాజిక వర్గాన్ని, వారి సెంటిమెంట్‌ను వైసీపీ అంచనా వేయలేకపోయింది. పవన్‌ను అన్న ప్రతి మాటను ఆ వర్గం తమకు జరిగిన అవమానంగా భావించింది. ఫలితంగా గోదావరి జిల్లాల్లో ఫ్యాన్ రెక్కలు తెగిపోయి, వైసీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘోర పరాజయం తర్వాతే వైసీపీలో అసలైన అంతర్మథనం మొదలైంది.

    ap-politics-ycps-u-turn-regarding-pawan
    ap-politics-ycps-u-turn-regarding-pawan

    AP POLITICS: వైసీపీ.. పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకూడదని

    ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకూడదని గట్టిగా డిసైడ్ అయింది. అందులో భాగమే మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తాజా వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు ఎవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని, ఒకవేళ కౌంటర్ ఇవ్వాల్సి వస్తే తానే చూసుకుంటానని ఆయన పార్టీ క్యాడర్‌కు స్పష్టమైన లీక్ ఇచ్చారు. అంటే, పవన్‌ను కెలికి మళ్లీ కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం వైసీపీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే విమర్శలను సాధ్యమైనంత స్మూత్ గా డీల్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

    మరోవైపు, రెండేళ్ల కూటమి పాలనపై క్షేత్రస్థాయిలో ఎంతోకొంత వ్యతిరేకత మొదలవుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కూడా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే చిన్న అసంతృప్తి నెమ్మదిగా బయటకు వస్తోంది. దీనికి తోడు.. నాకు కులం రంగు పులమకండి అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. పవన్‌ను వదిలేసి, కేవలం టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలనే టార్గెట్ చేయడం ద్వారా.. గతంలో తమపై కోపంతో దూరమైన వర్గాలను మళ్లీ మచ్చిక చేసుకోవచ్చనేది జగన్ అండ్ కో ప్లాన్. అయితే రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మరి పవన్ విషయంలో వైసీపీ తీసుకున్న ఈ లేటెస్ట్ యూ-టర్న్, అదేవిధంగా స్మూత్ హ్యాండ్లింగ్ స్ట్రాటజీ రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఏ మేరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.