TTD Hundi Record: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరికలు తీరుస్తూ వారి కొంగు బంగారం చేస్తున్న శ్రీ వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి ఎదురుచూస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇటీవల తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. వేసవి సెలవులు పూర్తి అయినప్పటికీ కొండ పై రద్దీ తగ్గలేదని చెప్పాలి. జూలై నెల పూర్తి కావడంతో టీటీడీ అధికారులు హుండీ ఆదాయానికి సంబంధించి పూర్తి వివరాలను తెలియ చేశారు.
జూలై నెలలో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఒక్క నెలలో ఏకంగా 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హుండీ ఆదాయ విషయానికి వస్తే తితిదే అందించిన వివరాల ప్రకారం, ఒక్క జులై నెలలోనే శ్రీవారికి హుండీ ద్వారా రూ.140.28 కోట్ల వచ్చినట్టు తెలుస్తుంది. ఇది రికార్డ్ స్థాయి ఆదాయం అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు తిరుమల ఆలయ చరిత్రలోనే ఈ స్థాయిలో హుండీ ఆదాయ రాలేదని, ఇదే మొదటిసారని టీటీడీ అధికారులు తెలిపారు.

TTD Hundi Record: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
ఇలా ఒక్క నెలలోనే లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం రావడమే కాకుండా వందల కోట్లహుండి ఆదాయం రావడం విశేషం.భక్తుల సౌకర్యార్థం దేవస్థానం కల్పించిన మెరుగైన ఏర్పాట్లు, దర్శన వ్యవస్థల వల్లనే ఈ స్థాయిలో భక్తుల రాక సాధ్యమైందని తితిదే ప్రతినిధులు తెలిపారు. ఇక వచ్చే నెలలో కూడా తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఇప్పటికే స్వామివారి సాల కట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ టీటీడీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీ ఉండబోతుందని అందుకు అనుగుణంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

