AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యూజ్ అండ్ త్రో అనే పదం కొత్తదేమీ కాకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని చూస్తుంటే ఈ విమర్శలు మరోసారి నిజమేననిపిస్తోందని రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీని గట్టెక్కించడానికి, ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడానికి కొందరు నేతలను అడ్డం పెట్టుకోవడం.. ఆ తర్వాత అవసరం తీరాక వారిని కనీసం పట్టించుకోకపోవడం జగన్కు మొదటి నుంచి ఉన్న అలవాటేననే ప్రచారం తాజా పరిణామాలతో మళ్లీ ఊపందుకుంది. తాజాగా కాపు సామాజిక వర్గ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం విషయంలో జరిగిన వ్యవహారమే దీనికి నిదర్శనంగా మారుతోంది.
గత ఎన్నికల వేళ జనసేన, టీడీపీ కూటమిని దెబ్బతీయడానికి వైసీపీకి ఒక బలమైన కాపు ముఖం అవసరమైంది. ఆ సమయంలో ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించి, ఆయన ఇమేజ్ను పూర్తిగా వాడుకున్నారు. సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ముద్రగడ వైసీపీ కోసం నిలబడ్డారు. అయితే, అధికారం పోయాక సీన్ రివర్స్ అయింది. హైదరాబాద్లో ఉన్న ముద్రగడను జగన్ పరామర్శిస్తారంటూ వైసీపీ అంతర్గత వర్గాలే స్వయంగా లీకులు ఇచ్చి, తీరా సమయానికి జగన్ తన రూట్ మార్చేయడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ముద్రగడ కంటే విజయవాడలో చనిపోయిన క్రాంతి కుమార్ కుటుంబానికే జగన్ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే.. అవసరం తీరిపోయిన సీనియర్ నేతకు జగన్ ఇచ్చిన విలువ ఏంటో స్పష్టమవుతోందని కాపు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

AP POLITICS: జగన్ రావడం లేదనే నింద తమపై పడకుండా..
ఈ ఊహించని షాక్ నుండి పార్టీ ఇమేజ్ను కాపాడుకోవడానికి వైసీపీ తెరవెనుక నడిపిన డ్యామేజ్ కంట్రోల్ డ్రామా ఇప్పుడు మరీ విచిత్రంగా మారింది. జగన్ రావడం లేదనే నింద తమపై పడకుండా.. ముద్రగడ కుమారుడితోనే ‘తామే ప్రస్తుతానికి రావొద్దని కోరాం’ అంటూ ఒక వివరణ వీడియోను రిలీజ్ చేయించడం గమనార్హం. ఎప్పుడూ లేని విధంగా హఠాత్తుగా ఇలాంటి కవర్-అప్ వీడియోలు బయటకు రావడంపై స్వయంగా వైసీపీలోని కొందరు కీలక నేతలే పెదవి విరుస్తున్నారు. అవసరమైనప్పుడు నెత్తిన పెట్టుకుని, పని అయిపోయాక సైడ్ ట్రాక్ పట్టించడం జగన్ మార్క్ పాలిటిక్స్ లో భాగమేనని, ముద్రగడ చాప్టర్ కూడా ఈ పొలిటికల్ శైలికి మరో బలమైన ఉదాహరణగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

