Andhra Pradesh: ఢిల్లీ వేదికగా దేశ రాజధానిలో సరికొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో.. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు నివేదికలతో పాటు, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల సమీకరణాలను బేరీజు వేస్తూ ఈ విస్తరణ ఉండబోతోంది. అయితే, ఈసారి అందరి కళ్లూ ఆంధ్రప్రదేశ్ వైపే ఉన్నాయి. వచ్చే 2029 ఎన్నికల నాటికి ఏపీలో కూటమిని తిరుగులేని శక్తిగా మార్చడమే లక్ష్యంగా మోదీ కేబినెట్లో ఏపీకి మరిన్ని కీలక పదవులు దక్కబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది.
ఈ రేసులో అందరికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు జనసేన పార్టీ. కేవలం ముగ్గురు పార్లమెంట్ సభ్యులు (ఇద్దరు లోక్సభ, ఒకరు రాజ్యసభ) మాత్రమే ఉన్నప్పటికీ.. జనసేనాని పవన్ కల్యాణ్ పొలిటికల్ క్రేజ్, కూటమి విజయంలో ఆయన పోషించిన పాత్రను బీజేపీ అధిష్ఠానం ప్రత్యేకంగా గుర్తిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ అగ్రనేతల సమావేశంలో పవన్ కల్యాణ్.. కేంద్ర పెద్దలతో అత్యంత కీలకమైన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జనసేనకు కేంద్రంలో ఒక కీలక మంత్రి పదవి ఖాయమైందనే గుసగుసలు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Andhra Pradesh: జనసేన నుంచి రేసులో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నాయి.
ప్రస్తుతం జనసేన నుంచి రేసులో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నాయి. కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.. ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడంతో, వీరిలో ఒకరికి లక్ చిక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియారిటీ పరంగా బాలశౌరి పేరు ముందంజలో ఉన్నట్లు టాక్. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన లింగమనేని రమేష్ (కమ్మ సామాజికవర్గం) పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. ఇప్పటికే టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అదే సామాజికవర్గం కోటాలో మంత్రిగా ఉన్నందున, సమీకరణాల దృష్ట్యా జనసేనకు ఇచ్చే పదవి కాపు సామాజికవర్గానికే దక్కేలా పవన్ కల్యాణ్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ విస్తరణలో మరో బెర్త్ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేబినెట్లో కింజారపు రామ్మోహన్ నాయుడు (కొప్పుల వెలమ), పెమ్మసాని చంద్రశేఖర్ (కమ్మ) ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈసారి రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇందులో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే.. బీజేపీ నుంచి ఉన్న శ్రీనివాసవర్మతో కలిపి ఏపీ నుంచి కేంద్ర మంత్రుల సంఖ్య ఐదుకు చేరుతుంది. మరి పవన్ కల్యాణ్ వేసిన ఈ ఢిల్లీ స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

