Sat. May 23rd, 2026

    AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమర శంఖం పూరించింది. జూన్, జూలై నెలల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నాలుగు కీలక స్థానాలు కూడా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారబోతున్నాయి.

    ఈ మెగా ఎన్నికలకు జూన్ 1వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక జూన్ 18వ తేదీన ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం పక్కా ప్లాన్‌తో సిద్ధమైంది. ఏపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పరిమల్ నత్వానీ, సానా సతీష్ బాబుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ సీట్లను దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు అప్పుడే ఊపందుకున్నాయి.

    ap-politics-rajya-sabha-elections-in-nagara-schedule-for-4-seats-in-ap
    ap-politics-rajya-sabha-elections-in-nagara-schedule-for-4-seats-in-ap

    AP POLITICS: ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో

    మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ, అలాగే మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లాంటి దిగ్గజాల పదవీ కాలం ముగియనుంది. గుజరాత్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 3, జార్ఖండ్‌లో 2, మణిపూర్‌లో ఒక స్థానానికి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. బలబలాల పరంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. జూన్ 18న తేలనున్న ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.