AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే ఏకైక పేరు కొడాలి నాని. తనదైన దూకుడు రాజకీయాలతో, ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే మాటలతో ఫైర్బ్రాండ్ గా ముద్రపడిన నాని.. గత ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. అయితే, ఓటమి కంటే కూడా ఎన్నికల తర్వాత ఆయన అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకప్పుడు ఉరుములు, మెరుపులతో ఊగిపోయిన నియోజకవర్గ వైసీపీ శ్రేణులు.. ఇప్పుడు లీడర్ అందుబాటులో లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక వైసీపీ నేతలే టార్గెట్గా రాజకీయాలు నడుస్తున్నాయి. పేర్ని నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటి నేతలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. వంశీ, జోగి రమేష్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నలుగురు కీలక నేతల్లో కొడాలి నానిపై కూడా కేసులు నమోదైనప్పటికీ, ఆయన అరెస్ట్ వరకు వెళ్లకపోవడం గమనార్హం. ఇదే సమయంలో ఆయనకు గుండె శస్త్రచికిత్స జరగడం, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటుండటంతో ఆయన పూర్తిగా ప్రజలకు, పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య సమస్యేనా లేక కూటమి ప్రభుత్వ అటాకింగ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవడానికి తీసుకున్న విరామమా అనే చర్చ గుడివాడలో జోరుగా సాగుతోంది.

AP POLITICS: కొడాలి నాని గ్రౌండ్ లెవల్లో అందుబాటులో లేకపోవడం
కొడాలి నాని గ్రౌండ్ లెవల్లో అందుబాటులో లేకపోవడం స్థానిక వైసీపీ శ్రేణులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ నేతల నుంచి లేదా అధికారుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అండగా నిలబడే పెద్ద దిక్కు లేరనే ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. గతంలో కేవలం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాత్రమే మెరిసిన నాని.. ఆరు నెలల్లో యాక్టివ్ అవుతానని ప్రామిస్ చేసినా, ఇప్పటికీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే స్థానిక నేతలు మాత్రమే మమ అనిపిస్తున్నారు తప్ప, కేడర్లో జోష్ నింపే గంభీర గళం వినిపించడం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యేపై వస్తున్న వ్యతిరేకతను కూడా తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నామని వైసీపీ శ్రేణులు విలవిలలాడుతున్నాయి.
నాని సన్నిహితులు మాత్రం.. ఆయన కేవలం హెల్త్ గ్రౌండ్స్ పైనే రెస్ట్ తీసుకుంటున్నారని, కేసులకు భయపడే రకం కాదని స్పష్టం చేస్తున్నారు. పండుగలు, శుభకార్యాలకు సంబంధించిన వారిని పలకరిస్తున్నప్పటికీ, డైరెక్ట్ పాలిటిక్స్కు మాత్రం ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏదేమైనా, గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవాలన్నా, కేడర్లో నైతిక బలం పెరగాలన్నా కొడాలి నాని రీ-ఎంట్రీ ఇవ్వడం అత్యంత కీలకంగా మారింది.

