Sat. Jul 11th, 2026

    AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియాలో జనసేనపై జరుగుతున్న దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఆ పార్టీ నేతలు వెనుకబడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇదే విషయంలో మిత్రపక్షం టీడీపీతో పోల్చి చూస్తే.. జనసేనలో ఏదో ఒక బలమైన లోపం కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

    తెలుగుదేశం పార్టీలో ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ ఉంది. అధినేత చంద్రబాబు నాయుడిపై లేదా పార్టీపై ప్రత్యర్థులు చిన్న విమర్శ చేసినా.. జిల్లాలతో సంబంధం లేకుండా, పదవులతో పని లేకుండా తమ్ముళ్లు మీడియా ముందుకు వచ్చేస్తారు. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా కౌంటర్లు ఇస్తూ ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేస్తారు. చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని ఇక చాలు అని వారించే వరకు ఆ దూకుడు తగ్గదు. మరి అలాంటి ఇన్‌స్టంట్‌ రెస్పాన్స్ పవర్ జనసేనలో ఎందుకు కనిపించడం లేదు? పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నా.. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

    ap-politics-is-the-kind-of-clout-seen-in-the-tdp-missing-in-the-jana-sena
    ap-politics-is-the-kind-of-clout-seen-in-the-tdp-missing-in-the-jana-sena

    AP POLITICS: పవన్ కల్యాణ్ కనీసం మూడు సార్లు తన పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. 

    గడిచిన రెండు మూడు నెలల్లోనే పవన్ కల్యాణ్ కనీసం మూడు సార్లు తన పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యర్థులు చేసే ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని, దూకుడుగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టంగా క్లాస్ పీకారు. కానీ, అధినేత ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనేది వాస్తవం. ఒకరిద్దరు నేతలు స్పందిస్తున్నా.. అవి ఒక్కోసారి పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, దానికి పవన్ కల్యాణ్ మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం జనసేన డిఫెన్సివ్ పాలిటిక్స్‌కు అద్దం పడుతోంది.

    ప్రస్తుతం ‘రావణ్’ అరెస్ట్, ఉపా (UAPA) కేసుల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ట్రోలింగ్, విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ప్రచారం ఇలాగే సాగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన పవన్.. తాజాగా మరోసారి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈసారి కేవలం నచ్చజెప్పడం కాకుండా, పద్ధతి మార్చుకోని నేతలకు ఘాటుగానే క్లాస్ ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

    టీడీపీలాగా ఒక పటిష్టమైన మీడియా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ జనసేనలో ఇంకా పూర్తిగా స్థిరపడలేదనేది నిజం. నాయకులలో చొరవ లోపించడం లేదా మనకెందుకులే అనే ధోరణి జనసేనకు మైనస్‌గా మారుతోంది. అధినేతను కాపాడుకునేందుకు, పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించేందుకు ఒక ప్రత్యేక పొలిటికల్ ఆర్మీ జనసేనకు అత్యవసరం. మరి పవన్ కల్యాణ్ ఇవ్వబోయే లేటెస్ట్ క్లాస్‌తోనైనా జనసేన లీడర్లలో ఆ పవర్ వస్తుందో లేదో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.