AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఈ విషయంలో పదే పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులకు ఇదే సందేహం వస్తోంది. దేశవ్యాప్తంగా చమురు ధరలు మండుతుంటే.. దానికి కేవలం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ రోడ్లపైకి రావడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది.
నిజానికి, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అనేది అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వంటి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం సామాన్యుడికి కూడా తెలుసు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకతో పాటు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వ విధానాలనే తప్పుబడుతున్నారు. కానీ, వైసీపీ మాత్రం కేంద్రం వైపు కన్నెత్తి చూడకుండా, కేవలం సీఎం చంద్రబాబు నాయుడే లక్ష్యంగా విమర్శలు గుప్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

AP Politics: చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతోనే
వైసీపీ మేధావి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త ధర్నాలకు క్యాడర్ సిద్ధమవుతోంది. చంద్రబాబు ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ చేయడం ఒకెత్తయితే.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలోనే ప్రజలను దోపిడీ చేస్తున్నారనడం వితండవాదంగా కనిపిస్తోంది. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేకనే, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వంపైకి మళ్లించేందుకు వైసీపీ ఈ తరహా సేఫ్ గేమ్ ఆడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అపరిపక్వ వ్యూహాల వల్ల ప్రజల్లో పార్టీ నవ్వులపాలు కాదా అనే ఇంగితం కూడా కొరవడిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అధికారం కోల్పోయిన తర్వాత అయినా వైసీపీ తన పంథా మార్చుకుంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. అసలు అధినేత జగన్కు పార్టీలోని పెద్దలు తప్పుడు సలహాలు ఇస్తున్నారా? లేక చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతోనే పార్టీని ఇలాంటి తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా, వాస్తవాలను పక్కనబెట్టి చేసే ఇలాంటి ఆందోళనలు రాజకీయంగా పార్టీకి మైలేజ్ ఇవ్వకపోగా.. `వైసీపీ ఇక మారదా.. ఎప్పుడూ రాంగ్ డైరెక్షన్లోనే వెళ్తుందా? ` అనే ముద్రను మరింత బలపరిచేలా చేస్తున్నాయి.

