Tollywood: టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా, వరల్డ్ బిల్డింగ్, విజువల్ వండర్ అనే మాటలే వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం కేటాయించడం, వందల కోట్ల బడ్జెట్ పెట్టించడం ఇండస్ట్రీలో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. క్వాలిటీ పేరుతో అవసరానికి మించి ఖర్చు చేయిస్తూ, ఏళ్ల తరబడి షూటింగ్లు లాగుతూ నిర్మాతల రక్తం తాగే దర్శకులు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో.. తాను అందరిలాంటి వాడిని కాదని నిరూపిస్తున్నారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత టాలీవుడ్లో ఆ రేంజ్ సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్న అనిల్.. సినిమాను హిట్ చేయడమే కాదు, నిర్మాత జేబు గుల్ల కాకుండా కాపాడటంలోనూ దిట్ట అనిపించుకుంటున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్లో రాబోతున్న మల్టీస్టారర్ ఒకటి. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని అందరూ అంచనా వేస్తారు. కానీ, అనిల్ రావిపూడి మాత్రం ఇండస్ట్రీ మైండ్ బ్లాక్ అయ్యే ప్లానింగ్తో రంగంలోకి దిగుతున్నారు. కేవలం 5 నెలల్లోనే ఈ భారీ సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 18న పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి, 22 నుంచే రెగ్యులర్ షూటింగ్ను పరుగులు పెట్టించబోతున్నారు. నవంబర్ కల్లా షూటింగ్ ముగించి, డిసెంబర్ నాటికి ఫస్ట్ కాపీ చేతికి అందిస్తానని నిర్మాతలకు భరోసా ఇచ్చారు.

Tollywood: వేగంగా సినిమా తీయడం వెనుక అనిల్ రావిపూడి పక్కా హోమ్వర్క్ ఉంది.
ఇంత వేగంగా సినిమా తీయడం వెనుక అనిల్ రావిపూడి పక్కా హోమ్వర్క్ ఉంది. షూటింగ్ ఇంకా మొదలుకాకముందే స్క్రిప్ట్ను లాక్ చేయడమే కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్తో కూర్చుని అప్పుడే 3 పాటలను కూడా ఓకే చేసేశారు. ఈ రేంజ్ స్పీడ్, జోరు ఇప్పటి టాలీవుడ్కు చాలా అవసరం. క్వాలిటీ పేరుతో కాలయాపన చేస్తూ నిర్మాతలపై వడ్డీల భారం పెంచే దర్శకులకు.. పక్కా ప్లానింగ్ ఉంటే ఐదు నెలల్లోనే సినిమాను ఫస్ట్ కాపీతో సహా సిద్ధం చేయవచ్చని అనిల్ రావిపూడి ప్రాక్టికల్గా చూపిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో సీనియర్ హీరో వెంకటేష్ కూడా డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ దశలో ఉంది. ఈ గ్యాప్లోనే అనిల్ రావిపూడి సినిమాకు కూడా కాల్షీట్లు సర్దుబాటు చేస్తూ వెంకీ మామ బిజీ కానున్నారు. దీనివల్ల దసరా బరిలో త్రివిక్రమ్ సినిమాతో థియేటర్లలోకి వచ్చే వెంకటేష్.. వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్తో మళ్లీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనున్నారు. మొత్తానికి, కమర్షియల్ సక్సెస్తో పాటు నిర్మాతలకు లైఫ్ సేవర్ గా మారుతున్న అనిల్ రావిపూడి ప్లానింగ్ చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ ముక్కున వేలేసుకుంటోంది.

