Mon. Jun 29th, 2026

    Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట అక్షరాలా నిజమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని ‘జొన్నగిరి’ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. “అక్కడ నిజంగానే బంగారం గనులు ఉన్నాయా? అది సాధ్యమేనా?” అని నిన్నమొన్నటి వరకు పెదవి విరిచిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా.. జొన్నగిరి స్వచ్ఛమైన బంగారం అప్పుడే మార్కెట్లోకి అడుగుపెట్టేసింది.

    ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ బంగారు మైనింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన వెంటనే, మార్కెట్‌లోకి గోల్డ్ అందుబాటులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడే తవ్వకాలు జరిగి, అప్పుడే బంగారం ఎలా వచ్చింది? అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ, ఈ మెరుపు విజయం వెనుక దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిశ్శబ్ద శ్రమ దాగి ఉంది. జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ వంటి సంస్థలు గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ భూగర్భ పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. పైగా, అధికారిక ప్రారంభోత్సవానికి ముందే.. గత కొన్ని నెలలుగా ఇక్కడ ప్రయోగాత్మకంగా ముడి రాయిని తవ్వి, ప్రాసెస్ చేసే పనులు నిరంతరాయంగా సాగాయి. ఆ ట్రయల్ రన్స్‌లో సేకరించిన బంగారమే ఇప్పుడు తొలి విడతగా మార్కెట్‌లోకి విడుదలైంది.

    chandrababu-jonnagiri-gold-has-it-already-hit-the-market
    chandrababu-jonnagiri-gold-has-it-already-hit-the-market

    Chandrababu: ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రెండో దశ విస్తరణ ప్లాంట్ 

    ప్రస్తుతం తొలి దశలో భాగంగా సుమారు 600 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మొదటి ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 400 కిలోల మేలిమి బంగారాన్ని ఉత్పత్తి చేయాలని కంపెనీ పక్కా ప్లాన్‌తో ఉంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రెండో దశ విస్తరణ ప్లాంట్ కూడా పూర్తయితే.. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి ఏకంగా 900 కిలోల నుంచి రెండు టన్నుల వరకు పెరుగుతుందని అంచనా.

    భారతదేశానికి ముడి చమురు తర్వాత అత్యధికంగా విదేశీ కరెన్సీ ఖర్చవుతున్నది బంగారం దిగుమతుల కోసమే. మన దేశం ఏటా దాదాపు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో జొన్నగిరి ప్రాజెక్ట్ దేశీయ అవసరాలకు కొంతైనా ఆసరాగా నిలిచి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయనుంది.

    chandrababu-jonnagiri-gold-has-it-already-hit-the-market
    chandrababu-jonnagiri-gold-has-it-already-hit-the-market

    ఈ ప్రాజెక్టు కేవలం బంగారాన్ని తవ్వి అమ్మేయడానికే పరిమితం కావడం లేదు. ఇక్కడ దొరికే గోల్డ్‌తో స్థానికంగానే ఒక అత్యాధునిక ‘జ్యువెలరీ పార్క్’ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే గనుక కార్యరూపం దాల్చితే.. రాయలసీమ ప్రాంతంలోని వేలాది మంది స్థానిక యువతకు, ముఖ్యంగా మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి నిన్నటివరకు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జొన్నగిరి.. ఇకపై దేశ ఆర్థిక రాతను మార్చే గోల్డ్ హబ్‌గా మారబోతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.