ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన వైసీపీ నిరసన వేదికను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన రాజకీయ మైలేజ్ కోసం పక్కాగా వాడుకున్నారనే టాక్ వినిపిస్తోంది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేస్తూ.. ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ నుంచి ఆయన ఏకంగా రూ. 45 కోట్ల లంచం తీసుకున్నారంటూ బైరెడ్డి చేసిన బహిరంగ ఆరోపణలు ఒక్కసారిగా జిల్లాలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే, ఇది కేవలం మంత్రిపై విమర్శ మాత్రమే కాదు.. కర్నూలు సిటీలో ఉన్న విపక్ష కేడర్ను తన వైపు తిప్పుకోవడానికి, ఇక్కడి రాజకీయాల్లో తానే వన్ అండ్ ఓన్లీ లీడర్గా ఎదగడానికి బైరెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Andhra Pradesh: బైరెడ్డి స్కెచ్ వర్కవుట్ అవుతుందో లేదో
బైరెడ్డి సడన్గా కర్నూలు సిటీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం స్థానిక వైసీపీ సీనియర్ నేతలకు అస్సలు మింగుడుపడటం లేదు. ఇప్పటికే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు స్థానిక నేతలు క్యూలో ఉన్నారు. ఇప్పుడు బైరెడ్డి వచ్చి నేరుగా మంత్రిని ఢీకొట్టడం ద్వారా.. ఇక్కడి లోకల్ లీడర్ల ప్రాధాన్యతను తగ్గించి, వారికి గట్టి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక పార్టీ పెద్దలైన సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి సలహాలు, ప్రోత్సాహం ఉందనే అనుమానాలు కూడా సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, బైరెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి టీజీ భరత్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. బైరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీంతో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. త్వరలోనే సివిల్ పరువు నష్టం కేసు కూడా వేస్తానని, కోర్టులో ఆరోపణలు ఎలా నిరూపిస్తారో చూస్తానని మంత్రి సవాల్ విసిరారు. కాగా, ఒకవైపు సొంత సోదరి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నుంచి రాజకీయంగా కౌంటర్లు ఎదుర్కొంటున్న సిద్ధార్థ్ రెడ్డి.. ఇప్పుడు కర్నూలు సీటు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు వైసీపీలో గ్రూపు తగాదాలను మరింత ముదరబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ బైరెడ్డి స్కెచ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి!

