TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు. ఆదివారం వేకువజామునే కొండపైకి చేరుకున్న ఆయన.. స్వామివారిపై తనకున్న అపారమైన నమ్మకాన్ని ప్రకటిస్తూ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు, వేద పండితులు అనంత్ అంబానీకి శేషవస్త్రం కప్పి, వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను ఘనంగా అందజేశారు.
అయితే, ఈ పర్యటన కేవలం దైవదర్శనానికే పరిమితం కాలేదు. తిరుమల కొండను పర్యావరణహితంగా మార్చే ఒక అద్భుతమైన మహత్కార్యానికి వేదికైంది. దర్శనం ముగించుకున్న తర్వాత టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ, తిరుమల పర్యావరణ పరిరక్షణ కోసం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించారు. ఘాట్ రోడ్లలో కాలుష్యాన్ని పూర్తిగా నివారించి, భక్తులకు స్వచ్ఛమైన గాలిని, సురక్షితమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో.. ఏకంగా రూ.27.5 కోట్ల విలువైన 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తిరుమల రవాణా వ్యవస్థలో సరికొత్త గ్రీన్ విప్లవానికి నాంది పలకనుంది.

TTD: విరాళంలో మరో విశేషం ఏమిటంటే.. కేవలం బస్సులను ఇవ్వడమే కాకుండా
ఈ విరాళంలో మరో విశేషం ఏమిటంటే.. కేవలం బస్సులను ఇవ్వడమే కాకుండా, వాటి దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యతను కూడా రిలయన్స్ సంస్థే భుజాన వేసుకుంది. ఈ 25 ఈ-బస్సులను నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను తామే భరిస్తామని అనంత్ అంబానీ ప్రకటించడం విశేషం. దీనివల్ల టీటీడీపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు. అంతేకాకుండా, ఈ వాహనాల రీఛార్జింగ్ కోసం కొండపై అత్యాధునిక చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం రిలయన్స్ సంస్థ పూర్తి సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పశు సంరక్షణకు ఊతమిచ్చేలా అనంత్ అంబానీ తీసుకున్న ఈ ఉదార నిర్ణయంపై భక్తజన కోటి హర్షం వ్యక్తం చేస్తోంది.

