Politics: నారా లోకేష్ ఈనెల 27 నుంచి పాదయాత్ర చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ గళం పేరుతో ఈ పాదయాత్రను చేపట్టడానికి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 123 నియోజకవర్గాల్లో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేయడానికి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ పార్టీ డీజీపీకి పర్మిషన్ కోసం లేఖ రాశారు. అయితే డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటివరకు పాదయాత్రపై ఎలాంటి అనుమతి రాలేదు. తాజాగా ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు ఎన్ని రోజులు జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు అనే వివరాలతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆదేశాలు వచ్చాయి.
అయితే పాదయాత్రను కావాలని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పాదయాత్ర చేస్తే ఎక్కడ ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోతుందో అనే భయం వైసీపీ పార్టీలో ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైయస్ జగన్ పాదయాత్రకి అనుమతి ఇవ్వకుండా ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చే వారే కాదని విమర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఇవ్వకున్నా పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని వర్ల రామయ్య తెలిపారు. కావాలని కుట్రలు చేస్తూ పాదయాత్రకు ఆటంకం సృష్టించాలని భావిస్తున్నారని విమర్శించారు. జగన్ పరిపాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాదయాత్రలో పాల్గొంటారని అన్నారు.
నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వైసీపీకి భయం వెంటాడుతుందని కొల్లు రవీంద్ర విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే యువశక్తిని అడ్డుకున్నట్లే అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే నారా లోకేష్ చేస్తుంది పాదయాత్ర కాదని టీడీపీ ఓటమి కోసం చేస్తున్న యాత్రని మంత్రి రోజా విమర్శించారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ టీడీపీ దారుణంగా ఓడిపోయిందని పేర్కొన్నారు. ఈ పాదయాత్రతో కూడా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తారని వ్యంగ్యంగా విమర్శలు చేశారు.
అలాగే నారా లోకేష్ పాదయాత్రలో దాడులు చేయాలని వైసిపి సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా చూపించారు. కుట్రలు చేసి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతే దీటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాధానం చెబుతారని అన్నారు. మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం వైసిపి పార్టీల మధ్య నారా లోకేష్ పాదయాత్ర మీద రాజకీయం నడుస్తుంది అనే మాట వినిపిస్తుంది.