Politics: ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. టీడీపీ కూడా వచ్చే ఎన్నికలలో గెలుపు మాదే అంటుంది. ఇక జనసేన కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం అంటుంది. రానున్న ఎన్నికలలో మా బలాన్ని పెంచుకుంటాం అని బీజేపీ అంటుంది. ఇలా పార్టీలు అన్ని కూడా పొత్తులు, రాజకీయ ఎత్తుగడలు, భవిష్యత్తు ప్రణాళికతో ముందుకి సాగుతున్నాయి. ఇక అధికారం నిలుపుకోవడం కోసం వైసీపీ నాలుగంచెల వ్యూహంతో ప్రతిపక్షాలతో ఫైట్ చేస్తుంది. ఇక టీడీపీ జనసేనతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తుంది. జనసేన భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ బస్సుయాత్రతో రాజకీయ క్షేత్రంలోకి దిగుతున్నారు. అలాగే పంచ వ్యూహాలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.
ఎలా అయిన వైసీపీని గద్దె దించాలి. తాము పీఠంపైకి ఎక్కాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఈ రాజకీయ ముఖచిత్రంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చి చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి ముందు ఫోకస్ ఏపీపైనే పెట్టారు. ఏపీలో ఇప్పటి వరకు అధికారం అనుభవిస్తున్న కులాలకి కాకుండా అత్యధిక జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వారిని ఆకట్టుకోవడమే ధ్యేయంగా ఏపీ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఇందులో భాగంగా కాపు నేత అయిన తోట చంద్రశేఖర్ కి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రానున్న రోజుల్లో కూడా ఆ మూడు కులాలకి చెందిన నాయకులని ఎక్కువగా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాక్ ఎండ్ లో దీనికి సంబందించిన వర్క్ నడుస్తుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
అయితే బీఆర్ఎస్ ఏపీ రాజకీయ ప్రయాణంలో 2024లో అధికారంలోకి వచ్చే స్థాయిలో ఉండదు. దీనికి కారణం కేసీఆర్ మీద ఏపీ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాగే రాష్ట్ర విభజనకి కారణమైన కేసీఆర్ ని ఏపీలో ఎదగనిస్తే తెలంగాణ అభివృద్ధి కోసం ఏపీ అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉందనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించే కేసీఆర్ ఏపీ అభివృద్ధిని కోరుకుంటాడని ఎవరు అనుకోరు. ఈ నేపధ్యంలో ఇప్పటికిప్పుడు ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందని మాత్రం ఎవరూ అనుకోరు. కాని తన సామాజిక సమీకరణాలు, రాజకీయ వ్యూహాలతో కచ్చితంగా గెలుపు ఓటములు డిసైడ్ చేసే వోట్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే కొంత మంది వైసీపీని దెబ్బ కొట్టి జనసేనని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఏపీ ఎంట్రీ జరిగిందని భావిస్తున్నారు.
అందుకే పవన్ కళ్యాణ్, కేసీఆర్ వ్యూహాత్మకంగా తోట చంద్రశేఖర్ ని పైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ అధ్యక్ష పగ్గాలు అప్పగించారని అంటున్నారు. అయితే కేసీఆర్ దత్త పుత్రుడుగా ఉన్న జగన్ కి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఏపీ రాజకీయ కార్యాచరణ నడుస్తుందని టీడీపీ సపోర్టర్స్ చేస్తున్న విమర్శ.అయితే టీడీపీకి మాత్రం కేసీఆర్ తో ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య తెలంగాణలో కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ టీడీపీని దెబ్బకొట్టే వ్యూహాలే సిద్ధం చేస్తాడని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయితే వైసీపీ, లేదంటే జనసేనకి బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల మాట.