Wed. Jun 3rd, 2026
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక ఎత్తైతే, ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏ పార్టీ తీర్థం పుచ్చుకోవాలో తెలియక సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం మరో ఎత్తు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాపాక వరప్రసాద్, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి చూస్తుంటే సామాన్య జనాలకు ఇదే డౌట్ వస్తోంది. అసలు ఈ ఇద్దరు లీడర్లు ఏ పార్టీ కండువాతో ఉన్నారో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.

    2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించినా, రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు రాపాక వరప్రసాద్. అయితే, ఆ గెలుపు జోష్ ఎంతో కాలం నిలవలేదు. కాలక్రమేణా ఆయన వైసీపీ గూటికి చేరిపోయారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో గత ఎన్నికల్లో ఏకంగా అమలాపురం పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేశారు. కానీ కూటమి దెబ్బకు రాపాక భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

    andhra-pradesh-rapaka-amanchi-which-party-are-these-two-in
    andhra-pradesh-rapaka-amanchi-which-party-are-these-two-in

    Andhra Pradesh: వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాపాక

    ఆ ఓటమితో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాపాక ఆ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. మళ్లీ పాత గూడైన జనసేనలోకి వెళ్లేందుకు ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేశారనే టాక్ నడిచింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి వలస నాయకులకు పార్టీలో నో ఎంట్రీ అని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. ఇటు వైసీపీ తో తెగతెంపులు చేసుకోలేక, అటు కూటమిలోకి వెళ్లలేక రాపాక పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం ఐడెంటిటీ క్రైసిస్‌లో పడింది.

    మరోవైపు కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా, చీరాల నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్‌గా ఆమంచి కృష్ణమోహన్‌కు మంచి పేరుంది. గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన చరిత్ర ఆయనది. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆమంచి, గత ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకోకపోవడం, చీరాలలో ఉనికి చాటుకోవడం కష్టంగా మారడంతో ఆమంచి సైలెంట్ అయిపోయారు. ఆయన మళ్లీ వైసీపీలోకి రీ-ఎంట్రీ ఇస్తారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం ఊపందుకుంది. కానీ ఈ విషయంలో ఆమంచి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అటు కాంగ్రెస్ జెండా మోయలేక, ఇటు వైసీపీ వైపు అడుగులు వేయలేక ఆయన మౌనాన్నే ఆశ్రయించారు. కాగా, రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు. కానీ ఈ ఇద్దరు సీనియర్ నాయకులు మాత్రం ప్రస్తుతం పొలిటికల్ గా ఎటూ తేల్చుకోలేని త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. రాబోయే రోజుల్లో వీరు తమ భవిష్యత్తు కార్యాచరణను ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? అనేది కాలమే నిర్ణయించాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.