Bandi Bhagirath Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన అతడిపై దర్యాప్తు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత ప్రకారం అత్యంత కఠినమైన సెక్షన్ను చేర్చడంతో భగీరథ్కు జీవిత ఖైదు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకానొక దశలో నీరుగారిపోతుందనుకున్న ఈ కేసు.. ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.
ఈ కేసు ప్రారంభంలో పేట్బషీరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని కాపాడేందుకు పోలీసులు బలహీనమైన సెక్షన్లు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలిపై ఒత్తిడి తెచ్చారనే వార్తలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన సర్కార్.. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే డీసీపీ రితిరాజ్ స్వయంగా రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్ రికార్డులను జల్లెడ పట్టారు.

Bandi Bhagirath Case: బండి భగీరథ్కు ఇక జైలు నుంచి బయటకు రావడం ఇంపాజిబుల్.!
పోలీసులు రాసిన స్టేట్మెంట్లో స్పష్టత లేకపోవడాన్ని గమనించిన డీసీపీ రితిరాజ్, నేరుగా బాధితురాలి ఇంటికే వెళ్లారు. అక్కడ ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ బాధితురాలిలో నమ్మకాన్ని నింపారు. దాంతో ఆ మైనర్ బాలిక అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించింది. నిందితుడు తనపై ఒకటి కంటే ఎక్కువసార్లు ఘోరానికి ఒడిగట్టాడని బాధితురాలు చెప్పిన మాటలు విని దర్యాప్తు అధికారి షాక్కు గురయ్యారు. పోలీసులు రాసిన కథనానికి, బాధితురాలు చెప్పిన నిజాలకు అస్సలు పొంతన లేకపోవడంతో కేసు రూపురేఖలనే మార్చేశారు.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఇది కేవలం వేధింపుల కేసు కాదని, అత్యంత తీవ్రమైన అత్యాచార నేరమని డీసీపీ నిర్ధారించారు. దీంతో పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1), 6 లతో పాటు, దీనికి సమానమైన బీఎన్ఎస్ సెక్షన్ 64(2)(M) ను అదనంగా చేర్చారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితుడికి కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష లేదా జీవితాంతం జైల్లోనే గడపాల్సి ఉంటుంది. పోలీసుల హైడ్రామాకు బ్రేక్ వేస్తూ డీసీపీ రితిరాజ్ తీసుకున్న ఈ నిర్ణయంతో నిందితుడు బండి భగీరథ్కు ఇక జైలు నుంచి బయటకు రావడం ఇంపాజిబుల్ అనే చర్చ నడుస్తోంది.

