News: చాలా మంది ప్రజలు తమ గమ్యానికి చేరుకోవడానికి రైల్వే మార్గాన్ని అనుసరిస్తుంటారు. టికెట్టు కాస్త తక్కువగా ఉండడం, సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో రైల్వే ప్రయాణానికి చాలామంది మొగ్గు చూపుతారు. టిక్కెట్టు ధర తక్కువ గా ఉన్న ప్లాట్ ఫామ్ పై ఏమైనా కొనాలి అంటే సామాన్యుడికి జోబు చిల్లవాల్సిందే. మార్కెట్లో ఉన్న ధరలకు రైల్వే స్టేషన్లలో పలికే ధరలకు అసలు పొంతనే ఉండదు. వాటర్ బాటిల్ లను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు. ఇది కొత్త విషయం ఏం కాదు. కానీ ఎవరికో బాగా కాలి ఈ భాగోతాన్ని బహిర్గతం చేశాడు. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్లపై దోపిడీ అంటూ ఏకంగా ట్విట్టర్లో మోత మోగించాడు. ఈ ట్వీట్ కు అధికారులే కదిలి సదరు వ్యాపారి కి జరిమానా విధించారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) టీ స్టాల్ యజమానిపై సెంట్రల్ రైల్వే అధికారులు రూ. 50,000 జరిమానా విధించారు. లీటర్ వాటర్ బాటిల్ కు ఎక్కువ ఛార్జ్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఆర్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు వెండర్ ఐడి కార్డు చూపించడంలో స్టాల్ యజమాని విఫలం కావడంతో అతనికి జరిమానా విధించారు.
@Central_Railway కుర్లా లోకమాన్య తిలక్ టెర్మినస్ యొక్క బహిరంగ దోపిడీ. రూ.15 రైల్ నీర్ బహిరంగంగా రూ. 20కి అమ్ముతున్నారు అన్న ట్వీట్ నవంబర్ 5 న వైరల్ అయ్యింది . ఈ వీడియోను దాదాపు 800 మంది ట్విట్టర్ వినియోగదారులు రీట్వీట్ చేశారు, 1,600 మంది లైక్ చేశారు. ఇది అన్ని రైల్వే స్టేషన్లలో జరుగుతున్న విషయమే అని ఎలాంటి భయం లేకుండా రూ.15 ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లను రూ.20కి విక్రయిస్తున్నారు అని స్టాల్ సిబ్బంది విశ్వాసం చూస్తుంటే ఇది మామూలు వ్యవహారంలా కనిపిస్తోందని ట్వీట్ లు చేశారు. విషయం కాస్త పెద్దది కావడంతో రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించామని ఎవరైనా దోషులుగా తేలితే, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారి తెలిపారు.
ఏదైనా ఇష్యూ జరిగితే దానిపై స్పందించడం కాదని, అధికారులు అప్రమత్తంగా ఉండి సామాన్యులను దోచుకునే ఇలాంటి వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.