YSRCP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే మాత్రం మళ్ళీ వైసీపీ అధికారానికి దూరం కావాల్సిందే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఓట్లు చీల్చడంతో పాటు టీడీపీ చేసిన వ్యతిరేక ప్రచారం వైసీపీకి బలంగా మారింది. అయితే 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాంటి పొరపాటు చేయకూడదని డిసైడ్ అయ్యారు. పొత్తులతో ఎన్నికలకి వెళ్తానని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన అయితే ఖాయం అని స్పష్టం చేశారు. అలాగే బీజేపీని కూడా ఒప్పించి కలిసి వచ్చేలా చేస్తానని అన్నారు.
తద్వారా వైసీపీని గద్దె దించడానికి తాను వేసిన వ్యూహాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టారు. అలాగే జనసేన తరుపున పోటీ చేసిన అభ్యర్ధులు అందరూ అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్థానానికి పోటీ లేనని చెప్పడంతో పాటు ప్రజలు ఇస్తే తీసుకుంటానని అన్నారు. తద్వారా బలమైన స్థానాలలో గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీలో ఉండే విషయాన్ని పరోక్షంగా ప్రజలకి వదిలేసారు. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేనని వేరు చేయడమే లక్ష్యంగా మొన్నటి వరకు వైసీపీ వ్యూహాలు నడిచాయి. అయితే రెండు పార్టీలు పొత్తు అనివార్యం అని పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయడంతో వైసీపీ అధిష్టానం ఇప్పుడు వ్యూహాలు మార్చుకోవడానికి సిద్ధం అవుతోంది.
ఇదే సమయంలో ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలా మంది అసంతృప్తులు జనసేనాని ప్రకటన కోసం ఇన్ని రోజులు ఎదురుచూశారు. ఇప్పుడు వారు ఆశించే ప్రకటన వచ్చేయడంతో ఇకపై అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తులు అధిష్టానం మీద విమర్శలు చేస్తూ బయటకి వస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ లేదంటే జనసేన గూటికి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సీటు ఖరారు చేసుకొని వైసీపీకి దూరం కావాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీగా వలసలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.