Tirumala Laddu: అలంకార ప్రియుడు, కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కొన్ని కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఇప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇకపోతే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో భారీ స్థాయిలో స్వామివారి లడ్డూలను కూడా కొనుగోలు చేశారు.
2026 మే నెలలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా మే నెలలో ఏకంగా ఒక కోటీ 21 లక్షల 35 వేల 528 లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది.2024 మేలో 1.01 కోట్లు, 2025 మేలో 1.10 కోట్ల లడ్డూలు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది మాత్రం రికార్డు స్థాయిలో ఒక కోటి 21 లక్షల 35 వేల లడ్డూలు అమ్ముడు పోవటం గమనార్హం. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ లడ్డు కొరత రాకుండా టీటీడీ ముందస్తు ఏర్పాట్లను నిర్వహించింది. భక్తులకు స్వామివారి ప్రసాదం కొరత లేకుండా ఎల్లప్పుడూ 8 నుండి 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచుతున్నారు.

Tirumala Laddu: నాణ్యతతో తిరుమల లడ్డు తయారీ..
స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఎంతో నాణ్యతతో తయారు చేయడమే కాకుండా చిన్న లడ్డులను 167 నుంచి 170 గ్రాముల బరువు ఉండేలా తయారు చేస్తున్నారు. ఈ లడ్డూల తయారీ కోసం ప్రతిరోజు 168 టన్నుల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు టిటిడి తెలిపింది.భక్తుల రద్దీకి తగ్గట్టుగా రోజుకు సగటున 4 లక్షల 8 వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదంలో నాణ్యత ఎక్కడ లోపించకుండా హై క్వాలిటీ ముడి పదార్థాలతో ఎంతో నాణ్యతతో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా ఈ ఏడాది లడ్డు ప్రసాదాల విక్రయాలలో టీటీడీ సరికొత్త రికార్డును సృష్టించింది.

