Spirtual: సనాతన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు, మరెన్నో పూజలు, ఇంకెన్నో వ్రతాలు ఉంటాయి. ఇవన్నీ మనుషులని ఆధ్యాత్మికం వైపు నడిపిస్తూ దైవంతో అనుబంధాన్ని పెంచుకునేలా చేస్తాయి. వీటి ద్వారా దేవుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా మనుషులు కనెక్ట్ అవుతారు. చాలా మంది వీటిని మూఢ నమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు అని కొట్టి పారేసిన. హిందూ మతంలో ఉన్న వారు ఇప్పటికి వీటిని నియమ నిష్ఠలతో ఆచరిస్తూ భగవంతునిపై తమ అంతులేని భక్తిని చాటుకుంటూ ఉంటారు. అలాగే మనం చేసిన పూర్వ జన్మ కర్మల కారణంగా ఈ జన్మలో అనుకోని కష్టాలు, అరిష్టాలు జీవితంలో చోటు చేసుకుంటాయని చాలా మంది బలంగా నమ్ముతారు.
అలాంటి వాటి నుంచి బయటపడటానికి దైవ సంబంధ పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది వేద పండితులు కూడా వ్రతాలు, పూజలు చేయడం వలన జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. మత గ్రంథాలలో కూడా కొన్ని రకాలైన పూజల యొక్క గొప్పతనం, వాటి వలన అప్పటి కాలంలో మనుషులు ఎలాంటి కష్టాల నుంచి బయట పడ్డారు అనే విశేషాలని మహర్షులు రాశారు. అలా హిందూ మతంలో బాగా ప్రాచూర్యంలో ఉన్న వ్రతాలు చాలా ఉన్నాయి. వాటిలో సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వినాయక వ్రతం, కార్తీకమాస వ్రతకల్పము, త్రిమూర్తుల వ్రతం, గాయత్రి వ్రతం, అష్టలక్ష్మి వ్రతం అని చాలా ఉన్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రాశస్త్యం ఉంటుంది. మానవ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు కష్టాలని ఆధారంగా చేసుకొని బ్రాహ్మణులు ఒక్కో వ్రతం చేస్తే మంచిది అని సూచిస్తారు. అలాంటి వ్రతాలలో వట సావిత్రి వ్రతం కూడా ఒకటి.
స్త్రీ సౌభాగ్యం కోసం, సుమంగళిగా ఉండటం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. దీనిని సుమంగళి వ్రతం అని కూడా అంటారు. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ వ్రతం ఎంతో పవిత్రమైనదిగా పండితులు చెబుతూ ఉంటారు. దైవాన్ని ప్రసన్నం చేసుకొని కుటుంబం, భర్త సౌభాగ్యం కోసం స్త్రీలు ఎంతో నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూర్వం మహా పతివ్రత సావిత్రి తన భర్త ప్రాణాలని తిరిగి దక్కించుకోవడం కోసం యముడితో పోరాటం చేసింది. దానికి సర్వ శక్తులు ఇవ్వమని కోరుతూ వటవృక్షన్ని భక్తితో పూజించింది. సనాతన ధర్మం ప్రకారం మర్రిచెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు.
అందుకే మర్రిచెట్టుని ఆరాధిస్తే ఆ త్రిమూర్తులని పూజించిన ఫలం లభిస్తుంది. అందుకే సావిత్రి మర్రిచెట్టు వద్ద పూజచేసి ఆ త్రిమూర్తులు ఇచ్చిన శక్తితో యముడితో పోరాడి భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఈ కారణంగానే ఈవ్రతానికి వట సావిత్రి వ్రతం అనే పేరు వచ్చింది. పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి మర్రిచెట్టు వద్దకి వెళ్లి సిందూరంతో మర్రిచెట్టుని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టు మొదలు చుట్టూ చుడుతూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం పూలు, గాజులు, పసుపు, కుంకుమలతో అలంకరించి దూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. సావిత్రి దేవిని కూడా ఈ సందర్భంగా ఆరాధిస్తారు. ఈ వ్రతం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో చేస్తూ ఉంటారు. జేష్ఠశుద్ధ పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతంలో భాగంగా వటవృక్షం చుట్టూ ఓం నమో వైవస్వత అంటూ 108 ప్రదక్షిణలు చేయాలి.