Wed. Jun 17th, 2026

    Revanth Reddy: తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది పడింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా.. అంతకంటే మెరుగైన వసతులతో ప్రభుత్వ ఆధ్వర్యంలో సరికొత్త ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ రూపుదిద్దుకున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మొదటి మోడల్ పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం, స్కూల్ ప్రాంగణమంతా కలియతిరిగి చూసిన సీఎం సైతం వసతులను చూసి ముగ్ధులయ్యారు.

    ఈ పాఠశాల లోపలికి అడుగుపెడితే ఇది ప్రభుత్వ స్కూలా లేక ఏదైనా ఇంటర్నేషనల్ స్కూలా అనే అనుమానం రాక మానదు. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదువుకునేలా ఈ విద్యాసంస్థను డిజైన్ చేశారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మించిన విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక డిజిటల్ బోర్డులు, సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ సెంటర్లు, అద్భుతమైన లైబ్రరీని చూస్తే ఏముందిరా బాబు అనకుండా ఉండలేం.

    revanth-reddy-Telangana Public School... Wow, what a place!
    revanth-reddy-Telangana Public School… Wow, what a place!

    Revanth Reddy: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 

    చదువుతో పాటు విద్యార్థుల శారీరక దృఢత్వానికి, క్రీడలకు ఈ స్కూల్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. విలాసవంతమైన ప్రైవేట్ స్కూళ్లలో సైతం అరుదుగా కనిపించే జిమ్ సదుపాయం ఇక్కడ ఉంది. దాంతో పాటు కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్ వంటి ఆటల కోసం ప్రత్యేకంగా కోచ్‌లను నియమించి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే 1,814 మంది విద్యార్థుల కోసం ఉచితంగా ఐదు ప్రత్యేక బస్సులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం.

    అన్నింటికీ మించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉదయాన్నే పౌష్టికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, సాయంత్రం వేడివేడి స్నాక్స్ అందిస్తూ కేవలం చదువు పైనే పిల్లలు శ్రద్ధ పెట్టేలా ప్లాన్ చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యార్థులతో కలిసి కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ముచ్చటించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఆరుట్లతో పాటు మంచాల, వంగూరు, పోల్కంపల్లిలో ఈ స్కూళ్లను ప్రారంభించగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 100 హైటెక్ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.