Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు కేవలం పోలీస్ స్టేషన్ రికార్డులకే పరిమితమైన ఈ వ్యవహారం, ఇప్పుడు హైదరాబాద్ వీధుల్లోకి చేరింది. నగరంలోని ప్రధాన బస్టాప్లు, గోడలపై వెలిసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
ఒక కేంద్ర మంత్రి కుమారుడు, అది కూడా అధికార పార్టీకి కంచుకోట లాంటి నేత వారసుడు పరారీలో ఉన్నారంటూ వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాలను షేక్ చేస్తున్నాయి. “బండి భగీరథ్ అబ్స్కాండింగ్.. ఆచూకీ తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో చెప్పండి” అంటూ ముద్రించిన ఈ పోస్టర్లు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు భగీరథ్ ఎక్కడ ఉన్నారు? ఆయన మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యింది? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Bandi Bhagirath: బండి భగీరథ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, బాధితురాలికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, కేసును వేగవంతం చేసేందుకు సిట్(SIT) ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా, భగీరథ్ స్పందించకపోవడం గమనార్హం.

ఒకవైపు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తుంటే, మరోవైపు భగీరథ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న సంకేతాల మధ్య, హైకోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా పనిచేస్తాయా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి, బండి కొడుకు వ్యవహారం అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు పెను సంచలనంగా మారింది. రాజకీయంగా ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న తరుణంలో, ఈ పోస్టర్ల కలకలం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

