Fri. Jun 19th, 2026

    YCP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం కొంతకాలంగా బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించేందుకు వీలుగా తన పొలిటికల్ అడ్రస్‌ను హైదరాబాద్‌కు మార్చేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    రాజకీయాల్లో వ్యూహాలతో పాటు సెంటిమెంట్లకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. వైసీపీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని అందించిన 2019 ఎన్నికల నాటి పరిస్థితులను జగన్ పునరావృతం చేయాలనుకుంటున్నారు. అప్పట్లో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ‘లోటస్ పాండ్’ వేదికగానే రాబోయే ఎన్నికల యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం కావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో ఉంటే క్యాడర్‌కు దూరం అవుతున్నామనే భావన పోవాలన్నా, పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం తేవాలన్నా హైదరాబాద్ కేంద్రంగా మారడమే సరైన నిర్ణయమని భావిస్తున్నారు.

    ycp-party-jagan-shifting-to-lotus-pond-in-that-very-month
    ycp-party-jagan-shifting-to-lotus-pond-in-that-very-month

    YCP PARTY: జగన్ హైదరాబాద్‌కు షిఫ్ట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    తాడేపల్లి కేంద్రంగా సాగుతున్న సమీక్షలకు కేవలం చుట్టుపక్కల జిల్లాల నాయకులే పరిమితమవుతుండటం, మెజారిటీ సీనియర్ నేతలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటుండటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. లోటస్ పాండ్‌లో నివాసం ఉంటూనే, ప్రతి రోజూ పార్టీ ముఖ్యులతో ముఖాముఖి చర్చలు జరపడం ద్వారా కేడర్‌లో నమ్మకాన్ని పెంచవచ్చనేది అధినేత ఆలోచన. కుటుంబ పరమైన ఆస్తుల పంపకాల్లో భాగంగా లోటస్ పాండ్‌లోని తన వాటాను క్లియర్ చేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి నుంచే పాలిటిక్స్ నడపాలని జగన్ గట్టిగా నిశ్చయించుకున్నట్లు భోగట్టా.

    ఈ కీలకమైన బదిలీకి కాలం కూడా కలిసి రాబోతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రానున్న ఆగస్టు నెలలో వచ్చే శ్రావణ మాసపు శుభ ముహూర్తాల్లోనే జగన్ హైదరాబాద్‌కు షిఫ్ట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, గతంలో 2017లో పాదయాత్ర మొదలుపెట్టి 2019లో 151 సీట్ల‌తో అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ.. 2027లో మళ్లీ జనాల్లోకి వెళ్లేలా సుదీర్ఘ పాదయాత్రకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారట. ఏదేమైనా, ఏపీ అధికార పక్ష నేతలతో పాటు ఇప్పుడు జగన్ కూడా భాగ్యనగరం నుంచే పావులు కదిపితే, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.