Fri. Jun 19th, 2026
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం ఇకపై కేవలం అలల సవ్వడికే పరిమితం కాబోవడం లేదు. పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి మజాను అందించేందుకు సరికొత్త రూపు సంతరించుకోబోతోంది. టూరిజం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఏపీ కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గోవా వెళ్తే లభించే బీచ్ సంస్కృతిని, ఆ కిక్కును ఇకపై మన ఏపీ తీరంలోనే అందించేలా సరికొత్త ‘బీచ్ షాక్స్ పాలసీ’ని అధికారికంగా తెరపైకి తెచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక జీవోను కూడా జారీ చేసింది.

    పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్, అలాగే పర్యాటక రాజధాని విశాఖపట్నం తీరాలను ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎంచుకుంది. ప్రాథమికంగా ఈ రెండు ప్రాంతాలలో రెండేసి చొప్పున, మొత్తం నాలుగు బీచ్ షాక్స్ (తాత్కాలిక బార్లు) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఇవి సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరిన్ని బీచ్‌లకు ఈ పాలసీని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

    andhra-pradesh-a-goa-like-vibe-on-ap-beaches-its-a-real-treat-for-them
    andhra-pradesh-a-goa-like-vibe-on-ap-beaches-its-a-real-treat-for-them

    Andhra Pradesh: బీచ్‌ల్లో ఎంజాయ్‌మెంట్‌తో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా

    అయితే గోవా సంస్కృతిని తెస్తున్నామని చెప్పి పర్యావరణాన్ని పణంగా పెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బీచ్ షాక్స్‌ను కేవలం పర్యావరణ అనుకూలమైన తాత్కాలిక సామగ్రితో మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. శాశ్వత కాంక్రీట్ కట్టడాలపై పూర్తిగా నిషేధం విధించారు. ప్రతి షాక్ 1,000 నుండి గరిష్టంగా 1,500 చదరపు అడుగుల పరిధిలోనే ఉండాలి. అలాగే సీఆర్ జెడ్ నిబంధనలు, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ వంటి అన్ని రకాల స్థానిక అనుమతులు సాధిస్తేనే వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.

    బీచ్‌ల్లో ఎంజాయ్‌మెంట్‌తో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. ఇక్కడ సాధారణ ఐఎమ్ఎఫ్ఎల్ బ్రాండ్లు, విదేశీ మద్యం విక్రయించడానికి వీల్లేదు. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బీర్, వైన్, రెడీ-టు-డ్రింక్ పానీయాలను మాత్రమే అనుమతిస్తారు. సమయం విషయంలోనూ కండిషన్స్ పెట్టారు. ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే ఈ షాక్స్‌లో లిక్కర్ సరఫరా చేయాలి. భద్రతా కారణాల దృష్ట్యా రాత్రి ఎనిమిది గంటలకే విక్రయాలు నిలిపివేయాల్సి ఉంటుంది.

    ఇక ఈ ప్రతిష్టాత్మక బీచ్ షాక్ బార్ లైసెన్స్‌ల కాలపరిమితిని మూడేళ్లుగా నిర్ణయించారు. వీటికి వార్షిక లైసెన్స్ ఫీజుగా ఏకంగా రూ. 75 ల‌క్ష‌లు ఖరారు చేశారు. ఈ ఫీజుపై ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంపు ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూనే, ఏపీ తీరాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ బ్లూ ఎకానమీ నిర్ణయంపై టూరిజం నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, వీకెండ్స్ వస్తే చాలు ఎక్కడికో వెళ్లాలనుకునే టూరిస్టులకు ఇకపై ఏపీ తీరంలోనే అసలైన పండగ షురూ కానుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.