CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే చాకచక్యంగా తిప్పికొట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం మాతో కలిసి పనిచేయాలంటూ ప్రధాని పరోక్షంగా ఇచ్చిన ఆఫర్కు.. రేవంత్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. కేంద్రంతో కలిసుండేది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప, కాషాయ గూటికి చేరడానికి కాదని స్పష్టం చేస్తూ మోడీ వ్యూహాన్ని చిత్తు చేశారు.
గతంలో అస్సాంలో హిమంత బిశ్వ శర్మను, మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేను ఏ విధంగానైతే తమవైపు తిప్పుకున్నారో.. అదే ఫార్ములాను తెలంగాణలో రేవంత్ రెడ్డిపై ప్రయోగించాలని బీజేపీ భావిస్తోందన్నది బహిరంగ రహస్యం. అయితే, రేవంత్ మాత్రం పాత చరిత్రలను గుర్తు చేస్తూనే, తాను ఆ బాపతు కాదని తేల్చి చెప్పారు. మోడీ చేసిన వ్యాఖ్యల్లోని రాజకీయ అంతరార్థాన్ని పసిగట్టిన రేవంత్.. అభివృద్ధి ముసుగులో చేసే రాజకీయాలకు తలొగ్గేది లేదని పరోక్షంగా హెచ్చరించారు.

CM Revanth Reddy: ప్రధాని వ్యాఖ్యలకు రేవంత్ ఇచ్చిన సమాధానం అత్యంత కీలకంగా మారింది.
ప్రధాని వ్యాఖ్యలకు రేవంత్ ఇచ్చిన సమాధానం అత్యంత కీలకంగా మారింది. “కేంద్రంతో కలుస్తాం.. కానీ అది మోడీతో కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, అంతకు మించి దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని ఆయన కౌంటర్ ఇచ్చారు. నిత్యం ఘర్షణ పడటం వల్ల రాష్ట్రానికే నష్టమని, అందుకే అభివృద్ధి విషయంలో రాజీ లేని సహకారం అందిస్తామని చెబుతూనే.. తన పొలిటికల్ లైన్ క్లియర్ చేసుకున్నారు.
ప్రధానితో వ్యక్తిగత భేటీ కోసం రెండు గంటల సమయం కోరిన రేవంత్.. అక్కడ కేవలం తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలనే చర్చిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలో తమకు స్పష్టమైన విజన్ ఉందని, దానికి కేంద్రం మద్దతు ఇవ్వాలే తప్ప, రాజకీయ లబ్ధి కోసం చూడకూడదని ఆయన గట్టిగా వినిపించారు. మోడీ ఆఫర్ను తిరస్కరించకుండానే, అందులోని రాజకీయ ఉచ్చులో పడకుండా రేవంత్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

