YS Jagan: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆసక్తికరమైన పరిణామాలకు దారితీస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వేగం పెంచిన సిబిఐ అందులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు మరోసారి పంపించింది. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిబిఐ విచారణలో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వైయస్ అవినాష్ రెడ్డి కేసు తన మీదకు వస్తుంది అనేసరికి కొత్త పల్లవి అందుకున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని నాశనం చేసే విధంగా ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ, అలాగే ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకుని కుమారుడిని కూడా కన్నారని, ఈ వ్యవహారంలోనే వివేక హత్య జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. మూడేళ్ల పాటు సిబిఐ విచారణ జరుగుతున్న ఎప్పుడు కూడా స్పందించని అవినాష్ రెడ్డి ఇప్పుడు కేసు తన దగ్గరకు వచ్చేసరికి ఇలా కొత్త పలుకు పలుకుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే గత ఎన్నికలలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వైయస్ జగన్ కి సింపతి ఓటింగ్ తీసుకురావడంలో ఎంతో ఉపయోగపడింది.
అయితే 2024 ఎన్నికలకు ముందు అదే వివేకానంద హత్య కేసు జగన్ కి వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యి, హత్య వారే చేశారని బలమైన ఆధారాలు చూపిస్తే మాత్రం కచ్చితంగా అది జగన్ మెడకు చుట్టుకుంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. చంద్రబాబు నాయుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయించారు అంటూ అప్పట్లో జగన్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవే ఆరోపణలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.