Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి తొమ్మిదేళ్ళు పూర్తయ్యి దశాబ్దంలోకి అడుగుపెడుతోంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఆరు దశాబ్దాల కల. ఎంతో మంది నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడారు. ఎంతో మంది బలిదానాలు చేశారు. అయితే ప్రతి సారి తెలంగాణ వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. అయితే 2014లో తెలంగాణ ఏర్పాటు మాత్రం చరిత్రలో నిలిచిపోతోంది. ఈ తెలంగాణ సాధనలో ప్రస్తుతం అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎక్కువ అని చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు డిమాండ్ చేస్తూ టీడీపీని వీడి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమాలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కూడా తెలంగాణ సాధన కోసం పోట్లాడారు.
అయితే ఈ తెలంగాణ ఉద్యమం ఎప్పుడు అయితే ప్రజా సంఘాలు, విద్యార్థులు చేతులలోకి వెళ్ళిందో అప్పటినుంచి తీవ్రతరం అయింది. తెలంగాణ సాధన కోసం చాలామంది ఆత్మబలిదానాలు చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. అదే సమయంలో కెసిఆర్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. చివరిగా 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సాధన ద్వారా ప్రజల్లోకి వెళ్లిన టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని అప్పగించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించారు.
ఆ తర్వాత బలమైన రాజకీయ శక్తిగా కేసీఆర్ తెలంగాణలో తన ప్రస్థానం పెంచుకుంటూ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ సాధన కోసం కొట్లాడిన పార్టీ బిజెపి అంటూ ఆ పార్టీ నాయకులు, ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే ఉద్యమాలు చేసి, తెలంగాణ కోసం ఉంచిన అమరవీరులను ఎవరు స్మరించుకోకపోవడం విశేషం. తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ఉద్యోగులు, విద్యార్థులు పోరాటం చేస్తే ఈ రోజు రాష్ట్రం ఏర్పడింది. అయితే రాజకీయ నాయకులు సాధన ఫలాలు అనుభవిస్తూ తమ ఖాతాలో వేసుకోవడం గమనార్హం.