AP NEWS: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకుపోతోంది. తాజాగా న్యాయవ్యవస్థ బలోపేతంతో పాటు, యువ న్యాయవాదులకు ఊరటనిచ్చేలా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వృత్తిలోకి కొత్తగా వచ్చే జూనియర్ లాయర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూసేందుకు, వారికి ఇచ్చే నెలవారీ స్టైఫండ్ను భారీగా పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు అందుతున్న ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఏకంగా రూ. 10 వేలకు పెంచుతున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక జీవో కూడా త్వరలోనే వెలువడనుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జూనియర్ న్యాయవాదుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ, సరైన ఆదాయం లేక ఇబ్బంది పడే లా గ్రాడ్యుయేట్లకు ఈ పది వేల రూపాయల స్టైఫండ్ పెద్ద కొండంత అండగా మారనుంది. కేవలం స్టైఫండ్ పెంపుతోనే ఆగకుండా, న్యాయవ్యవస్థలో పనిచేసే లా ఆఫీసర్లు, ఇతర న్యాయాధికారుల జీతభత్యాలను, వసతులను కూడా పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP NEWS: వారికి ప్రభుత్వం మరో అదిరిపోయే గుడ్ న్యూస్
ఇక ఈ స్టైఫండ్ పెంపుతో పాటు నిరుద్యోగులకు, న్యాయశాఖలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి ప్రభుత్వం మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఈ విభాగంలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న 1,770 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. కోర్టుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం రూ.216 కోట్లను కేటాయించింది. మొత్తానికి ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఏపీ న్యాయశాఖలో సరికొత్త మార్పులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది.

