Thu. Jul 2nd, 2026

    AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి వైపు కన్నెత్తి చూడని వైసీపీ, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాడు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని పూర్తిగా పక్కనబెట్టిన జగన్ పార్టీ, ఇప్పుడు అక్కడ పర్యటించేందుకు సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని సెంటిమెంట్‌ను దెబ్బతీసిన వైసీపీకి, అసలు అమరావతి మట్టిపై అడుగుపెట్టే నైతిక హక్కు ఉందా అంటూ ప్రజాసంఘాలు, కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

    తాజాగా అమరావతి పరిధిలో భూముల సేకరణ, రైతుల ఇబ్బందులంటూ వైసీపీ ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడిన ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమే ఆలస్యం.. ఉండవల్లి సెంటర్ వద్ద సీన్ ఒక్కసారిగా మారిపోయింది. “గో బ్యాక్ వైసీపీ” అంటూ కూటమి సానుభూతిపరులు, స్థానిక రైతులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మాటల యుద్ధం కాస్తా తోపులాటగా మారడం, వైసీపీ వాహనాలపై రాళ్ల దాడి జరగడంతో తాడేపల్లి పరిసర ప్రాంతాలు క్షణాల్లో రణరంగంగా మారాయి.

     

    ap-politics-does-the-ycp-even-have-that-right-uproar-over-amaravati
    ap-politics-does-the-ycp-even-have-that-right-uproar-over-amaravati

    AP POLITICS: మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ.. 

    గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి గ్రామాలు ఎదుర్కొన్న నిర్బంధాలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబుకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోననే సంకుచిత ఆలోచనతోనే వైసీపీ ఆనాడు రాజధాని పనులను నత్తనడకన నడిపించిందని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం సాగాలన్న కనీస సూత్రాన్ని విస్మరించి, ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారనే కోపం అమరావతి ప్రజల్లో ఇంకా చల్లారలేదు. ఇప్పుడు రెండో విడత భూముల పేరుతో కొంతమందిని వైసీపీ ఆఫీసుకు రప్పించుకుని, అమరావతి పరిరక్షణ కమిటీలంటూ డ్రామాలు ఆడటంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.

    ఇక రాజధాని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు ఏ ప్రతిపక్షానికైనా ఉంటుంది. కానీ, అసలు అమరావతిపై వైసీపీ అధికారిక స్టాండ్ ఏంటో చెప్పకుండా ఇలాంటి పర్యటనలు చేయడం వల్లే ఈ రచ్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటివరకు మూడు రాజధానులు అని, ఇవాళ మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ.. ముందుగా అమరావతి విషయంలో ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో, రాజధాని గ్రామాల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ వైసీపీ నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు, తీవ్ర ప్రతిఘటన తప్పవనేది తాజా ఘటనతో స్పష్టమవుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.