AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతి భవిష్యత్తును పూర్తిగా మార్చేసేలా ఒక సంచలన నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, అమరావతిని పరిపాలనా పరంగా దేశంలోనే ఒక కీలక హబ్గా మార్చేందుకు మోదీ సర్కార్ పక్కా వ్యూహంతో ముందుకు కదిలింది.
బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ స్వయంగా ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం భారీ నివాస సముదాయాలతో పాటు, పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రులంతా ఏకగ్రీవంగా ఓకే చెప్పడంతో, అమరావతిపై కేంద్ర వైఖరి ఏంటనేది మునుపెన్నడూ లేని విధంగా స్పష్టమైపోయింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వస్తున్న భారీ రుణాలకు తోడు.. ఇప్పుడు కేంద్ర సంస్థల ఎంట్రీతో అమరావతి నిర్మాణం శరవేగంగా పరుగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

AP POLITICS: జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ అనే విశ్లేషణలు
కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నప్పటికీ, జగన్ మాత్రం ఇంకా తన పాత పంథానే కొనసాగిస్తున్నారు. ఇటీవలే తనను కలవడానికి వచ్చిన అమరావతి రైతులతో మాట్లాడుతూ.. ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) పరిధిలోనే రాజధాని ఉండాలనే తన ఆలోచనను ఆయన మళ్లీ ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ ల్యాండ్ పూలింగ్ వెనక్కి తీసుకునే లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు.
అయితే, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అమరావతి ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే, మరోవైపు కేంద్రం ఏకంగా చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పించింది. ఇప్పుడు ఏకంగా కేంద్ర కార్యాలయాలనే అక్కడకు తరలిస్తుండటంతో, ఇక అమరావతిని మార్చడం ఎవరి తరమూ కాదనే సంకేతాలు స్పష్టంగా వెళ్లాయి. ప్రస్తుత పరిస్థితులు బట్టి జగన్ తన రాజధాని వ్యూహాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రజల ఆకాంక్షలు, ఇటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రెండూ అమరావతికే అనుకూలంగా ఉన్న వేళ.. జగన్ ఇంకా మూడు రాజధానులు లేదా మావిగన్ అనే పాత నినాదాలకే పరిమితమైతే రాజకీయంగా మరింత నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి కేంద్రం విసిరిన ఈ అమరావతి అస్త్రానికి జగన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారు? తన పంతాన్ని వీడి కొత్త వ్యూహాన్ని రచిస్తారా? లేక పాత బాటలోనే నడుస్తారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.

