BJP: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుటుంబం చుట్టూ ఒక్కసారిగా వివాదాలు ముసురుకున్నాయి. ఆయన కుమారుడు బండి భగీరథ్పై ‘పోక్సో’ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు అందడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. మైనర్ బాలిక వేధింపుల ఆరోపణలు ఒకవైపు, తనను పక్కా ప్లాన్తో ‘హనీ ట్రాప్’ చేశారంటూ భగీరథ్ ఇచ్చిన కౌంటర్ కంప్లైంట్ మరోవైపు.. కలిపి ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మధ్య హైటెన్షన్ పుట్టిస్తోంది.
హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై ఒక మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గత డిసెంబర్ 31న ఒక ఫామ్హౌస్లో జరిగిన వేడుకలో, 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి భగీరథ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గతంలోనూ భగీరథ్పై ర్యాగింగ్ వంటి వివాదాలు ఉండటంతో, తాజా ఫిర్యాదు కేంద్ర మంత్రి కుటుంబానికి పెద్ద రాజకీయ సంకటంగా మారింది.

BJP: బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తనపై కేసు నమోదైన వెంటనే భగీరథ్ కూడా ఎదురు దాడికి దిగారు. తనను బద్నాం చేయడానికి ఒక కుటుంబం పక్కా స్కెచ్ వేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను టార్గెట్ చేసిందని, స్నేహం పేరుతో సాన్నిహిత్యం పెంచుకుని ఇప్పుడు వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు యువతి కుటుంబం తన నుంచి ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తోందని, ఇప్పటికే తాను రూ. 50 వేలు చెల్లించానని ఆయన వెల్లడించడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ, కేంద్ర మంత్రి కుమారుడిపై ఇలాంటి తీవ్రమైన ఫిర్యాదు రావడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విపక్షాలు ఇప్పటికే బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి మొదలుపెట్టాయి. మైనర్ బాలిక పట్ల భగీరథ్ నిజంగానే తప్పుగా ప్రవర్తించాడా? లేక డబ్బు కోసం సదరు కుటుంబం ఆయన్ను ట్రాప్ చేసిందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రెండు వైపుల నుంచి పరస్పర ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫామ్హౌస్ పార్టీలో అసలేం జరిగింది? ఆ వీడియోల వెనుక ఉన్న కథేంటి? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, ఈ ఉదంతం బండి సంజయ్ రాజకీయ ప్రత్యర్థులకు బలమైన ఆయుధంగా మారింది.

