Fri. Nov 14th, 2025

    TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు ఇకపై సిఫారసు లేఖలతో గదులు ఇవ్వకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న వారు ముందుగానే తిరుమలకు వచ్చి సిఫారసు లేఖల ఆధారంగా గదులు పొందడం, దీని వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.

    ఇకపై SSD టోకెన్లు తీసుకున్న భక్తులు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టోకెన్లు పొందిన అనంతరం నేరుగా తిరుమలలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో గదులు కావాలంటే సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన దూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసు లేఖల ఆధారంగా గదులు కేటాయిస్తారు. అదే విధంగా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఎక్కువ గదులు తీసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ, ఇకపై కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గదుల కేటాయింపు చేస్తారు.

    TTD: ఆలయాల నిర్మాణానికి నిధుల మంజూరు

    భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు కూడా టీటీడీ నడుం బిగించింది. అదేవిధంగా ఆలయాల నిర్మాణానికి నిధుల మంజూరు, వేద పారాయణదారులకు భృతి, కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి అనేక కీలక అంశాలను ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. ఈ చర్యల వల్ల భక్తుల సంఖ్యను బట్టి మరింత సమర్థవంతంగా వసతి, దర్శన ఏర్పాట్లు చేయగలమని టీటీడీ భావిస్తోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.