Summer Effects: మారుతున్న కాలంతో వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో కాలుష్యం ప్రభావం కూడా పెరిగిపోతోంది. ఇవన్ని గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వలన సహజమైన కాలాలలో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలగతి కూడా మారుతోంది. వేసవి తాపం విపరీతంగా పెరిగిపోతోంది. 40 డిగ్రీలు అనేది సాధారణ టెంపరేచర్ గా మారిపోయింది. అత్యధికంగా 47, 49 డిగ్రీలు కూడా నమోదు అవుతూ ఉండటం విశేషం. వేసవి కాలం వచ్చింది అంటే ఉదయం 9 గంటలకె ఉష్ణతాపం కనిపిస్తోంది. సూర్యుడి వేడికి తాళలేక 9 నుంచి 5 గంటల మధ్య ప్రయాణాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఎద వేడి కారణంగా చాలా మంది వడదెబ్బకి గురవుతూ ఉంటారు.
ఈ సూర్యరశ్మి ప్రభావం ఇప్పుడు శరీరంలో ఇతర అవయవాల పనితీరుపైన కూడా ప్రభావం చూపుతోంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూత్ర పిండాలని ఈ వేడి తాపం అనేది దెబ్బ తీస్తుందని చెబుతున్నారు సగటు మనిషి ఉష్ణోగ్రత 36.5-37.5 డిగ్రీల సెల్సియస్ మధ్య హెచ్చుతగ్గులని తట్టుకోగలడు. అయితే వేడి, ఒత్తిడి ఎక్కువగా ఉండే కొద్ది శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. శరీరంలో వేడిని సమతుల్యం చేయడంలో మూత్రపిండాలు ప్రధానగా పని చేస్తాయి. శరీరంలోని రక్తపోటు, నీరు, ఎలక్ట్రోలైట్లను ముత్రపిండాలు నియంత్రిస్తాయి. వేడి ఒత్తిడి మూత్రపిండాలపై అదనపు భారం వేస్తుంది.
దాని వల్ల అవయవాలు దెబ్బతింటాయి . ఒత్తిడి ఎక్కువ అవుతున్న కొద్ది మూత్రపిండ రుగ్మతలు ప్రభావం ఎక్కువ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఉష్ణతాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే నీరు ఎక్కువగా తాగాలి. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న సమయాలలో వీలైనంత వరకు బయట తిరగకుండా ఉండటం ఉత్తమం. వేడి గాలులకు ప్రత్యక్షంగా తగలకుండా ఉండాలి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వేడి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరమని సూచిస్తుంది. మొత్తానికి వేసవిలో వేడితాపం అనేది శరీరంలో సమతౌల్యాన్ని దెబ్బ తీయడమే కాకుండా అనారోగ్యాల బారిన పడటానికి కారణం అవుతోందని నిపుణులు చెబుతున్న మాట.