Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నవంబర్ నెలలో జరిగే పుష్పయాగం సేవకు సంబంధించి టికెట్ కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేశారు. ప్రతీ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల తర్వాత.. శ్రీ వేంకటేశ్వర స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ ఏడాది నవంబర్ 16 వ తేదీ ఈ పుష్ప యాగం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 21 న టికెట్లను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
పుష్పయాగం సేవకు ఒక్కో భక్తుడికి రూ.700 చొప్పున టికెట్ ధరను టీటీడీ నిర్ణయించింది. మొత్తం ఈ పుష్పయాగం సేవకు సుమారు 1,000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. ఈ టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని ఆఫ్ లైన్ లో ఈ సేవ టికెట్లు అందుబాటులో ఉండవని టీటీడీ అధికారులు తెలియచేశారు. ఒక మొబైల్ ద్వారా రెండు టికెట్లను బుక్ చేసుకొని వెసులుబాటును కూడా కల్పించారు. 12 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు ఫ్రీగా ఉంటుందని వారు ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ పుష్పయాగ సేవకు సంబంధించిన టికెట్ బుక్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

Pushpayagam Seva Tickets: ఒకే రోజు రెండు సార్లు దర్శనం..
ఇక ఈ పుష్ప యాగం సేవ టికెట్లను పొందాలి అనుకునే భక్తులకు టిటిడి అధికారులు ఒక నిబంధనను కూడా పెట్టారు..ఈ ఏడాది నవంబర్ 16వ తేదీకు ముందు 180 రోజుల వ్యవధిలో ఏదైనా ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులు పుష్పయాగం టికెట్ బుక్ చేసుకునేందుకు అర్హులు కారు అని టీటీడీ కండిషన్ పెట్టింది.కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, జ్యేష్టాభిషేకం, పవిత్రోత్సవం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుంది. పుష్ప యాగ సేవ టికెట్ పొందిన వారు ఒకే రోజు రెండుసార్లు స్వామివారి దర్శనం చేసుకునే వెసులుబాటును కూడా పొందవచ్చు.

