Mon. Jun 22nd, 2026

    AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ, కేవలం తన విద్యాసంస్థల నిర్వహణకే పరిమితమైన ఆయన.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనే వైసీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉంటున్న అవంతి, తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు విశాఖ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

    గతంలో ఆయన టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారనే టాక్ వినిపించినా ఎందుకో సైలెంట్ అయిపోయారు. అయితే, ఇప్పుడు జనసేన పార్టీ తీసుకున్న ఒక తాజా నిర్ణయం అవంతి రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్‌లా మారిందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి కీలక నేతలను ఆహ్వానించేందుకు జనసేన అధిష్టానం ఒక ప్రత్యేక ‘జాయినింగ్స్ కమిటీ’ని రంగంలోకి దించింది. గతంలో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించిన జనసేన, ఇప్పుడు గేట్లు ఎత్తేయడంతో బలమైన కాపు సామాజికవర్గ నేతగా, మాజీ ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఉన్న అవంతి శ్రీనివాస్‌ను పార్టీలోకి తెచ్చేందుకు ఆ కమిటీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

    bye-bye-to-ycp-former-minister-avanthi-eyes-that-party
    bye-bye-to-ycp-former-minister-avanthi-eyes-that-party

    AP POLITICS: అవంతి శ్రీనివాస్ జనసేన వైపు మొగ్గు చూపడానికి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు..

    అవంతి శ్రీనివాస్ జనసేన వైపు మొగ్గు చూపడానికి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు కూడా బలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, విశాఖ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గమైన భీమిలి రెండుగా మారే అవకాశం ఉంది. భీమిలి, మధురవాడలుగా ఇది విడిపోతే.. జనసేన తరపున పోటీ చేస్తే విజయం నల్లేరుపై నడకేనని అవంతి లెక్కలు వేసుకుంటున్నారట. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఉండటం కూడా ఆయనకు పవన్ కళ్యాణ్ పార్టీలో ప్లస్ పాయింట్ కానుంది.

    మరోవైపు, తన రాజకీయ వారసుడిని రంగంలోకి దించి సేఫ్ ఫ్యూచర్ అందించాలనే ప్లాన్‌లో కూడా అవంతి ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ వైపు వెళ్లే ఛాన్స్ లేకపోవడం, టీడీపీలో ఇప్పటికే స్థానిక సమీకరణాలు గట్టిగా ఉండటంతో.. జనసేన రూపంలో ఆయనకు ఒక బెస్ట్ ఆప్షన్ దొరికినట్లయింది. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న అవంతి లాంటి లీడర్ వస్తే విశాఖలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జనసేన సైతం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, జనసేన జాయినింగ్స్ కమిటీ అధికారికంగా రంగంలోకి దిగితే.. విశాఖ జిల్లా నుంచి పవన్ పార్టీలోకి వెళ్లే మొదటి వికెట్ అవంతి శ్రీనివాస్ దేననే ప్రచారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.