Panchamukhi Shiva Lingam: ఉత్తర్ప్రదేశ్లోని బదాయూ జిల్లాలో మంగళవారం అద్భుతం చోటుచేసుకుంది. దాతాగంజ్ తహసీల్ పరిధిలోని సరాయ్ పిపరియా గ్రామంలో కొలను తవ్వక పనుల సందర్భంగా పంచముఖి శివలింగం బయటపడింది. దీని వయసు సుమారు 300 ఏళ్లు ఉండొచ్చని స్థానిక బ్రహ్మదేవ్ మందిర పూజారి మహంత్ పరమాత్మా దాస్ మహరాజ్ తెలిపారు. అయిదు ముఖాలతో ఉన్న ఈ శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ తవ్వకాలు నర్మదా బచావో ఆందోళన్కు చెందిన కార్యకర్త, పర్యావరణవేత్త శిప్రా పాఠక్ చేపట్టారు. తన 13 ఎకరాల స్థలంలో తామరు కొలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా తవ్వకాలు జరిపారు. అదే ప్రదేశంలో ఆమె ‘పంచతత్వ పౌధ్శాల’ పేరిట నర్సరీను కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఐదు లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పని చేస్తున్న పాఠక్ ఈ శివలింగం వెలికితీతను భగవంతుడి అనుగ్రహంగా అభివర్ణించారు.

Panchamukhi Shiva Lingam: భక్తిశ్రద్ధలతో గ్రామాన్ని సందర్శిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం స్పందించింది. శివలింగం ప్రాముఖ్యతను పరిశీలించేందుకు పురావస్తు శాఖ అధికారులను రంగంలోకి దించాలని దాతాగంజ్ సబ్డివిజనల్ మెజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. శాస్త్రీయంగా పరిశీలించిన తరువాత శివలింగ ప్రాచీనత, విలువ మరింత స్పష్టమవుతుందని అంచనా. మొత్తంగా, ఈ విశేష ఘటన దైవసాన్నిధ్యంగా భావిస్తూ ప్రజలు భక్తిశ్రద్ధలతో గ్రామాన్ని సందర్శిస్తున్నారు.

