Mahesh Babu: హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రముఖ సినీనటుడు మహేశ్బాబుకు నోటీసులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సాయి సూర్య డెవలపర్స్’ ప్రచారకర్తగా మహేశ్బాబు వ్యవహరించారని పేర్కొంటూ, ఈ సంస్థపై వచ్చిన ఫిర్యాదులో ఆయనను మూడో ప్రతివాదిగా చేర్చారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం, ఒక వైద్యురాలు మరియు మరొకరికి కలిపి సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తా మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు రూ.34.80 లక్షలు చెల్లించారు. మహేశ్బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ ద్వారా ప్రాజెక్ట్ విశేషాలు ఆకట్టుకోవడంతో డబ్బు పెట్టుబడి పెట్టినట్టు వారు తెలిపారు. అయితే, తరువాత తెలిసినదేమంటే.. ఆ ప్రాజెక్టుకు సరైన లేఅవుట్ అనుమతులు లేవని తెలిసింది.

Mahesh Babu: ఫోన్ చేస్తే కట్ చేసినట్లు బాధితులు తెలిపారు.
ఫిర్యాదుదారులు డబ్బు వెనక్కి ఇవ్వమని కోరితే, రెండో ప్రతివాది కొన్ని వాయిదాల్లో కేవలం రూ.15 లక్షలు మాత్రమే తిరిగిచ్చారు. మిగతా మొత్తం విషయంలో ఆలస్యం చేస్తూ, ఫోన్ చేస్తే కట్ చేసినట్లు బాధితులు తెలిపారు. దీంతో మిగిలిన డబ్బు కోసం వారు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
ఈ కేసులో మహేశ్బాబును మూడో ప్రతివాదిగా పేర్కొంటూ, ఆయన ప్రచారంలో భాగంగా తన పేరు, ఫోటోను వినియోగించడం వల్ల తాము మోసపోయామంటూ వాదన చేశారు. కమిషన్, ఈ కేసులో మహేశ్బాబు సహా మిగతా ప్రతివాదులు విచారణకు హాజరు కావాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మీడియా మరియు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

