YS Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలలో మరల అధికారంలోకి రావాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఓ వైపు సొంతపార్టీలోనే అసంతృప్తి ఎక్కువ అయిపోతూ ఉండటం జగన్ ని మరింత కలవరపెడుతుంది. ఈ నేపధ్యంలో వీలైనంత వేగంగా ప్రజలలోకి వెళ్లి ఈ అసంతృప్తి నాయకుల ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసారు. మరింత మంది వీరి దారిలోనే వెళ్ళేదిశగా ఉన్నారు.
జనసేన టీడీపీతో కలుస్తుందని ప్రచారం తెరపైకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలలో గుబులు మొదలైంది. ఇదిలా ఉంటే మరోవైపు అధికారాన్ని సొంతం చేసుకోవాలని జగన్ రెడ్డి తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు తిరిగి పార్టీకి రివర్స్ కొడుతున్నాయి. ఎమ్మెల్యేలు గ్రామాలలోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని గ్రామాలలో ఎమ్మెల్యేలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. మరో వైపు జగన్ సమావేశాలు పెడుతూ ఇప్పుడు కులాల వారీగా సభలు పెట్టాలని, బీసీ సభ పెట్టినట్లే అన్ని కులాల పేర్లతో సభలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకి జగన్ అల్టిమేటం జారీ చేశారు.

అలాగే గ్రామసారథులని సిద్ధం చేసి వారికి వీలైనంత త్వరలో బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు. అయితే పైసా ఆదాయం లేకుండా పార్టీ కోసం పనిచేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. అధికారంలోకి వస్తే ఏదో ఒక విధంగా పదవులు లేదా ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపిస్తున్న ఎవరూ ముందుకి రావడం లేదు. మరో వైపు ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకొని చూస్తా అని ప్రజలలో వ్యతిరేకత ఉందని తెలిస్తే మాత్రం సీట్లు ఇచ్చేది లేదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.
ఇలా అన్నిరకాలుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లని అష్టదిగ్బంధనంలో ముఖ్యమంత్రి జగన్ పెట్టేసి యుద్ధం చేస్తున్నారు. ఇవన్ని తిరిగి పార్టీకి రివర్స్ లో ఎటాక్ చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. వీటిని ప్రతిపక్షాలు చూస్తూ తమకి అనుకూలంగా మార్చుకోవడానికి వెయిట్ చేస్తున్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

