Wed. Jan 21st, 2026

    YS Jagan: ఏపీ రాజకీయాలలో పార్టీల మధ్య వైరం రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీతో మరల అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వ్యూహాత్మక ఎత్తుగడలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ఊహించని పరాభవం ఎదురయింది.  ఇదిలా ఉంటే మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏడు స్థానాలను సొంతం చేసుకొని క్లీన్ స్వీప్ చేయాలని భావించిన వైసీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేల షాక్ ఇచ్చారు.  ఏకంగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడి టిడిపి అభ్యర్థి పంచమర్తి అనురాధ గెలవడానికి సహకరించారు. 

    అసలు టిడిపి అభ్యర్థి గెలుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. చంద్రబాబు నాయుడు కేవలం ప్రతిష్టను కాపాడుకోవడానికి పంచమర్తి అనురాధను బలి పశువు చేస్తున్నాడని అందరూ విమర్శలు చేశారు. అయితే ఊహించని విధంగా జరిగిన ఎమ్మెల్సీ పోటీలలో పంచమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి.  నిజానికి టిడిపికి ప్రస్తుతం అంత బలం లేదు.  19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.  అయితే ఇద్దరు వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు టిడిపికి మద్దతు ఇచ్చారు.  ఆ లెక్కన చూసుకున్న 21 ఓట్లు మాత్రమే తెలుగుదేశం అభ్యర్థికి రావాలి. కాని 23 ఓట్లు రావడం సంచలనంగా మారింది.  దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడి టిడిపి అభ్యర్థులు గెలిపించినట్లు నిర్ధారణ అయింది. 

    ఇప్పుడు వారు ఎవరనేది వైసిపి అధిష్టానం సమీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది.  ఇక చంద్రబాబు నాయుడు డబ్బులతో వారిని కొన్నాడని వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.  తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ ఉండవల్లి శ్రీదేవి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాలేదు.  దీంతో వారిద్దరు క్రాస్ ఓటింగ్ పాల్పడి ఉంటారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.  మరి ముఖ్యమంత్రి జగన్ వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే వైసిపి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి ముందు ఉన్న వైసిపి ఫ్లెక్సీలను, పార్టీ కండువా కప్పుకుని ఉన్న ఫోటోలను తొలగించారు.  దీంతో ఆయన టిడిపికి మద్దతు ప్రకటించారని వైసీపీ శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చేసాయి.